హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. విమాన విడిభాగాల తయారీలో ఇప్పటికే దేశీయంగా దూసుకుపోతున్న హైదరాబాద్ నగరంలో.. ఇప్పుడు విమానాలు, హెలీకాప్టర్లకు ఉపయోగించే గేర్బాక్స్లు కూడా తయారు కానున్నాయి. హైదరాబాద్కు చెందిన స్కంద ఏరోస్పేస్ టెక్నాలజీ సంస్థ.. స్థానిక రఘు వంశీ మెషీన్ టూల్స్, అమెరికాకు చెందిన రేవ్ గేర్స్ ఎల్ఎల్సీ భాగస్వామ్యంతో అత్యాధునిక విమానాలు, హెలీకాప్టర్ గేర్బాక్స్ల తయారీ సౌకర్యాన్ని మంగళవారం ఇక్కడ ప్రారంభించింది. ఈ తరహా సౌకర్యం దేశంలో ఇదే ప్రథమం కావడం గమనార్హం. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ ఏరోస్పేస్, డిఫెన్స్ విభాగం డైరెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, సంస్థకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా జయేశ్ రంజన్ తెలియజేశారు.
రూ.150 కోట్ల పెట్టుబడులు
స్కంద ఏరోస్పేస్ మొదటి దశలో రూ.75 కోట్ల పెట్టుబడితో ఈ గేర్బాక్స్ల తయారీ సౌకర్యాన్ని ప్రారంభించింది. అయితే వచ్చే రెండు, మూడేండ్లలో మరో రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. దేశీయ అవసరాలతోపాటు అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్కు కూడా ఈ గేర్బాక్స్లను ఎగుమతి చేయనున్నారు. దీంతో డిఫెన్స్, కమర్షియల్ ఏవియేషన్ రంగాలకు ఇది కలిసి రానున్నది. ఇక ప్రస్తుతం ఈ సంస్థలో 150 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వచ్చే మూడేండ్లలో ఉద్యోగుల సంఖ్య 1,000కి పెరుగుతుందని సంస్థ స్పష్టం చేసింది. కాగా, స్కంద ఏరోస్పేస్కు తొమ్మిది మిలియన్ డాలర్ల వార్షిక ఆర్డర్లను అందించేందుకు సిద్ధమని రేవ్ గేర్స్ ప్రకటించింది. రఘువంశీ సంస్థ ఎండీ వంశీ వికాస్ మాట్లాడుతూ.. భారత ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో దీన్నో కీలక మైలురాయిగా అభివర్ణించారు. దేశీయ ఏరోస్పేస్ రంగం.. రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో తన ఉనికిని చాటుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.