Elon Musk-Twitter | పంతంతో మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ను టెస్లా-స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్మస్క్ సొంతం చేసుకున్నారు. పూర్తిగా.. అధికారికంగా ఆయన నియంత్రణలోకి వెళ్లిన తర్వాత ట్విట్టర్లో ఎటువంటి మార్పులు జరుగుతాయన్న అంశాలపై ఇప్పుడు చర్చ జరుగుతున్నది. ట్విట్టర్ పనితీరుపై కొన్ని వారాలుగా ఆయన విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. కొన్ని అంశాల్లో యూజర్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ట్విట్టర్లో ఉన్న పూర్తి శక్తి సామర్థ్యాలను బయటకు తీసుకొస్తానని చెప్పారు. దీన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతానని ప్రతీన బూనారు. అందుకు అనుగుణంగా ఆయన ఎలా ట్విట్టర్లో మార్పులు తీసుకొస్తారోనని యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణకు వాక్ స్వాతంత్య్రాన్ని ఎలన్మస్క్ ఎలా ప్రోత్సహిస్తారన్నది, ఎటువంటి మార్పులు సూచిస్తారన్నది మున్ముందు తెలియనున్నది.
ఎవరైనా నెటిజన్లు తాము చేసిన ట్వీట్ను సవరించేందుకు వీలుగా ఎడిట్ బటన్ చేర్చాలని తొలి నుంచి ఎలన్మస్క్ వాదిస్తున్నారు. 2019 నుంచి దీనిపై పట్టుబట్టిన మస్క్.. ఈ విషయమై నిర్వహించిన సర్వేలో 74 మంది ఎడిట్ బటన్కు అనుకూలంగా ఓటేశారు. అటుపైనే ఎడిట్ బటన్పై పని చేస్తున్నామని ట్విట్టర్ ప్రకటించడం గమనార్హం.
ప్రస్తుతం ట్విట్టర్లో హానికరం, తప్పుడు సమాచారం అంటే కొన్ని ట్వీట్లను నియంత్రిస్తున్నారని ఎలన్మస్క్ అభియోగం. ఇది పూర్తి వాక్ స్వాతంత్య్రానికి వ్యతిరేకం అని ఆయన భావిస్తున్నారు. ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించే అవకాశం ఇస్తేనే సమాజంలో విస్తృత స్థాయి చర్చకు మార్గం ఏర్పడుతుందని అంటున్నారు. అందుకనుగుణంగా ట్విట్టర్లో పలు మార్పులు తేవాలని గతంలో పలుసార్లు వాదించారు.
వాక్ స్వాతంత్య్రం కోసమే ట్విట్టర్ను కొనుగోలు చేశానంటున్న ఎలన్మస్క్.. గతంలో ట్విట్టర్ నిషేధానికి గురైన వారి విషయంలో సానుకూలంగా స్పందించే అవకాశం ఉందంటున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై నిషేధాన్ని ఎత్తివేయొచ్చనని భావిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం కలిగి ఉండాలని, అప్పుడే వాక్ స్వాతంత్య్రం నిలదొక్కుకోగలుగుతుందని ఎలన్మస్క్ అభిప్రాయ పడుతున్నారు.
ట్విట్టర్ ఎల్గారిథమ్ను ఓపెన్ సోర్స్గా మార్చాలని అవసరం ఉందని ఎలన్మస్క్ చెబుతున్నారు. అల్గారిథమ్ను రహస్యంగా ఉంచడం వల్ల పక్షపాత వైఖరి ప్రదర్శించే అవకాశం ఉంటుందంటున్నారు. దాన్ని ఓపెన్ సోర్స్గా మార్చడం వల్ల నెటిజన్లు తాము చేసే పోస్ట్లు వారి టైంలైన్పై ఎందుకు కనిపిస్తున్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుందని వాదిస్తున్నారు మస్క్. పోస్టులను ప్రమోట్ చేస్తున్న తీరు, వాటిని తొక్కి పడుతున్న తీరు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
సోషల్ మీడియాలో ప్రజలు తమ అభిప్రాయాలు తెలియ జేయడానికి పొడవాటి సందేశాలను అనుమతించాలని ఎలన్మస్క్ ప్రతిపాదించారు. తొలుత 140 అక్షరాలకు మాత్రమే పరిమితం చేసిన పోస్ట్ను ఐదేండ్ల (2017) క్రితం 280 అక్షరాలకు ట్విట్టర్ పొడిగించింది. ట్విట్టర్లో ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి స్పామ్బాట్ ఒకటి. తన కొనుగోలు ఒప్పందానికి ఆమోదం లభిస్తే, ఆ స్పామ్ బాట్ను తొలగిస్తానని హామీ ఇచ్చారు. ఆ స్పామ్ బాట్ను ఎలన్మస్క్ తొలగిస్తారా? లేదా? అన్న సంగతి మున్ముందు తేలనున్నది.