PM KISAN Yojana | పంటల సాగులో అన్నదాతలకు చేయూతనిచ్చేందుకు దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ యోజన పథకం కింద 11.8 కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం అందజేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్లో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెడుతూ ఈ సంగతి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న అతిపెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) ఒకటి అని తెలిపారు. ఈ పథకం కింద ప్రతి రైతుకు మూడు విడుతల్లో ఎకరానికి రూ.6,000 నగదు బదిలీ చేస్తున్నదని తెలిపారు. 2019 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ సమర్పించిన బడ్జెట్ ప్రకారం ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో ఈ నిధులు బదిలీ చేస్తున్నారు. 2018 డిసెంబర్ నుంచే ఈ పథకం అమల్లోకి వచ్చింది.