Singareni | హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సిరుల‘వేణి’గా వెలుగొందుతున్న సింగరేణి మరో చరిత్ర సృష్టించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,222 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.1,227 కోట్లతో పోలిస్తే ఇది 81 శాతం అధికమని పేర్కొంది. అలాగే 2021- 22 సంవత్సరంలో రూ.26,585 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సంస్థ..తరువాత ఏడాది రూ.33,065 టర్నోవర్ సాధించింది. వృద్ధి పరంగా చూస్తే ఇది 214 శాతం అధికమని తెలిపింది. గతేడాది 67.14 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిన సంస్థ..66.69 మిలియన్ టన్నుల బొగ్గును విక్రయించింది.
ప్రభుత్వరంగ సంస్థల్లో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న సంస్థగా సింగరేణి రికార్డు సృష్టించింది. వృద్ధిపరంగా చూస్తే కేంద్ర సంస్థలైన కోల్ ఇండియాతోపాటు ఇతర కంపెనీలను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రెండో స్థానంలో నిలవగా, కోల్ ఇండియా నాలుగో స్థానానికి పరిమితమైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. కేవలం ఎనిమిదేండ్లలోనే అనూహ్య వృద్ధిని సాధించింది. 2013-14లో రూ.413 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన సంస్థ..2022-23 నాటికి 430 శాతం వృద్ధితో తొలి స్థానంలో నిలిచినట్టు అయింది. ఆయా సంస్థల పరంగా చూస్తే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 241 శాతం వృద్ధితో ఆ తర్వాతి స్థానంలో నిలువగా..పవర్ ఫైనాన్స్ కంపెనీ 114 శాత వృద్ధిని సాధించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి అద్భుతమైన ప్రగతిని సాధించింది. కేవలం ఎనిమిదేండ్లలోనే వందేండ్ల అభివృద్ధిని చవిచూసింది. బొగ్గు ఉత్పత్తిలో 33 శాతం, రవాణాలో 39 శాతం, అమ్మకాల్లో 177 శాతం, లాభాల్లో 430 శాతం వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సహకారంతో సింగరేణి అనూహ్య వృద్ధిని సాధించింది. కార్మికులకు లాభాల్లో వాటాగా బోనస్తోపాటు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. ఈ ఏడాది కూడా నిర్దేశించిన రూ.4 వేల కోట్ల లాభాలు వచ్చే అవకాశం ఉన్నది.
– ఎన్ శ్రీధర్, సింగరేణి సీఎండీ