సింగరేణి సిరులు పండిస్తున్నది. ‘సమైక్య’ విధ్వంసాలను చెరిపేసుకుంటూ ఊహకందని ప్రగతి
సాధిస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కొత్తరూపును సంతరించుకొని రాష్ర్టానికే
మణిహారంగా నిలుస్తున్నది.
గోదావరిఖని, డిసెంబర్ 21: సింగరేణి ప్రగతిపథంలో పరుగులు పెడుతున్నది. ఏడున్నరేండ్లలో ఎన్నో మార్పులు, మరెన్నో హామీల అమలు, కారుణ్య నియామకాలు, కొలువులతో కొత్తరూపు సంతరించుకున్నది. థర్మల్, సౌర విద్యుదుత్పత్తితో మరో మైలురాయిని దాటడమేకాదు.. సంక్షోభంలోనూ దేశంలో మరే సంస్థ సాధించని భారీ లాభాలతో నయా చరిత్ర సృష్టిస్తున్నది. విస్తరణలోనూ కీలక అడుగులు వేస్తూ ఇతర రాష్ర్టాల్లోని గనులను దక్కించుకున్న సంస్థ.. శుక్రవారం 103వ ఆవిర్భావ వేడుకలకు ముస్తాబైంది. అయితే ఏటా పన్నుల రూపంలో సంస్థ నుంచి వేల కోట్ల రూపాయలను దండుకుంటున్న కేంద్రం.. సింగరేణికి మొండిచేయి చూపిస్తున్నది. నాలుగు బొగ్గు బ్లాకులను అమ్మివేసే చర్యలకు సిద్ధం కావడంపై ఇప్పుడు సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది.
సంక్షోభంలోనూ భరోసా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించే లక్ష్యంతో సింగరేణి ముందుకు సాగుతోంది. ఈసారి రికార్డుస్థాయి బొగ్గు ఉత్పత్తి ఖాయమన్న అంచనాలున్నాయి. రాష్ట్రం ఏర్పడిన సమయంలో కేవలం 50 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తితోనే ఉన్నది. ఇక అప్పట్లో అరకొరగా ఉన్న లాభాలూ.. భారీగా పెరుగుతూపోతున్నాయి. 2017-18లో సంస్థ రికార్డు స్థాయిలో రూ.1,766 కోట్ల లాభాలు ఆర్జించింది. కొవిడ్ టైంలో నిలిపేసిన 15 రోజులకు వేతనాన్ని చెల్లించగా, ఆన్డ్యూటీలో ఉండి మృతి చెందినవారికి రూ.5 లక్షలు ప్రకటించారు. కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాలు కల్పిస్తున్నారు. మొత్తానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సింగరేణి స్వరూపం మారిపోతుందని ఆనాడు చెప్పిన మాటలు అక్షర సత్యమయ్యాయి.
నిండా ముంచుతున్న కేంద్రం
సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వానికి కేవలం ఆదాయ వనరుగానే ఉండిపోయింది. గడిచిన ఐదేండ్లలో జీఎస్టీ, ఐటీ, సెంట్రల్ ఎక్సైజ్, క్లీన్ ఎనర్జీ సెస్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఇతర పన్నుల రూపేణా భారీగానే చెల్లించింది. సింగరేణిలో 49 శాతం వాటా కలిగిన కేంద్రానికి.. సంస్థ నుంచి భారీగానే నిధులు వెళ్తున్నా.. తిరిగి వచ్చేదేమి లేదు. ఇక రాష్ర్టానికి సింగరేణి నుంచి ఆదాయం వస్తోన్నా.. అంతకన్నా ఎక్కువగానే సీఎం కేసీఆర్ కార్మికులకు మళ్లీ అందజేస్తున్నారు. కార్మికుల ఆదాయ పన్ను అంశం చాలా ఏండ్లుగా పరిష్కారానికి నోచుకోకుండాపోతున్నది. అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపినా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.
దక్కన్ కంపెనీ నుంచి
130 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ను గతంలో దక్కన్ కంపెనీగా వ్యవహరించేవారు. భద్రాచలం రామున్ని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులు మార్గమధ్యలో వంటకోసం పొయ్యిలను ఏర్పాటు చేసుకోగా అవి మండటంతో తొలిసారిగా బొగ్గు ఖనిజం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం.. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన డాక్టర్ విలియం కింగ్ అనే జియాలజిస్టు ఇల్లెందు ప్రాంతంలో పరిశోధనలు చేసి 1871లో బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. బ్రిటీష్ పాలకుల ఆధ్వర్యంలోని హైదరాబాద్ దక్కన్ కంపెనీ 1886లో బొగ్గు తవ్వకాల హక్కులు పొందింది. 1889లో సింగరేణి గ్రామం వద్ద తొలి బొగ్గు గనిని తవ్వి బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. 1920 డిసెంబర్ 23న హైదరాబాద్ దక్కన్ కంపెనీని ‘సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్’గా పేరు మార్చారు.
సీఎం కేసీఆర్ చొరవతో అభివృద్ధి..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చొరవతో సింగరేణి సంస్థ అద్భుత అభివృద్ధి సాధించింది. సింగరేణి బొగ్గు ఉత్పత్తి రంగంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ఆవిర్భావం తరువాత అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధిస్తూ రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించింది. సింగరేణి పట్ల సీఎం కేసీఆర్ చూపిన ప్రత్యేక శ్రద్ద, దిశా నిర్దేశం కారణంగా అద్భుతమైన రీతిలో అభివృద్ధిని సాధిస్తోంది. సంస్థ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక అగ్రగామి సంస్థగా నిలవాలని ఆకాంక్షించిన కేసీఆర్ దీనికి అనుగుణంగా సంపూర్ణ సహకారం అందించి యువకులు, ఉత్సాహ వంతులైన తెలంగాణ ప్రాంత ఐఏఎస్ అధికారి ఎన్ శ్రీధర్ను సింగరేణి సీఎండీగా నియమించి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తంగా 9,597 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించాయి. వీరిలో ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ద్వారా 3,025 మందిని తీసుకోగా..డిపెండెంట్-కారుణ్య నియామకాల ద్వారా 5,672 రిక్రూట్ చేసుకున్నది.