Silver Rates | దేశీయ బులియన్ మార్కెట్లో వరుసగా రెండో రోజు వెండి ధర తాజా జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కిలో వెండి ధర రూ.300 పెరిగి రూ.89 వేల మార్కును దాటింది. గురువారం ట్రేడింగ్లో కిలో వెండి ధర రూ.88,700 వద్ద ముగిసింది. మరోవైపు 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.150 తగ్గి రూ.73,900 వద్ద స్థిర పడింది. గురువారం సెషన్లో రూ.74,050 వద్ద స్థిర పడింది.
యూఎస్ డాలర్, ట్రెజరీ బాండ్లు కొన్ని వారాల కనిష్ట స్థాయి నుంచి రికవరీ సాధించడంతో బంగారం ధర తగ్గుముఖం పట్టిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. క్రితం సెషన్ తో పోలిస్తే యూఎస్ డాలర్ ఇండెక్స్ 0.22 శాతం పెరిగింది. రిటైల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గించాల్సిన అవసరం ఉందని యూఎస్ ఫెడ్ రిజర్వ్ విధాన నిర్ణేతలు భావిస్తున్నారు. మరికొంత కాలం రుణ ఖర్చులు ఎక్కువగానే కొనసాగుతాయని యూఎస్ ఫెడ్ రిజర్వ్ విధాన నిర్ణేతలు భావిస్తున్నారని సౌమిల్ గాంధీ చెప్పారు.
అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ స్పాట్ గోల్డ్లో ఔన్స్ బంగారం (24 క్యారట్స్) ధర ఆరు డాలర్లు తగ్గి 2380 డాలర్ల వద్ద స్థిర పడింది. మరోవైపు ఔన్స్ వెండి ధర 29.65 డాలర్లకు పెరిగి, ట్రేడింగ్ ముగిసే సమయానికి 29.55 డాలర్ల వద్ద నిలిచింది.