దేశీయంగా రూపాయి విలువ అత్యంత కనిష్ఠస్థాయికి తగ్గినా గత కాలమ్లో సూచించిన రీతిలోనే క్రితం వారం ప్రారంభంలోనే నిఫ్టీ ర్యాలీ జరిపి 15,927 పాయింట్ల గరిష్ఠాన్ని అందుకుంది. అయితే శుక్రవారం అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్రో ఎగుమతులు, బంగారం దిగుమతులపై సుంకాలు వడ్డించడంతో 15,511 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది. అదే రోజున వేగంగా కోలుకోవడంతో వారం మొత్తం మీద 53పాయింట్ల లాభంతో 15,752 పాయింట్ల వద్ద నిలిచింది.
జూలై డెరివేటివ్ సిరీస్కు షార్ట్ పొజిషన్ల రోలోవర్ స్వల్పంగా ఉన్నందున, ఈ నెలలో ఒడిదుడుకులు తక్కువగా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే శుక్రవారం పతనం తర్వాత రికవరీ సందర్భంగా డెయిలీ చార్ట్ల్లో హేమర్ క్యాండిల్ ఏర్పడటం సానుకూల సంకేతమని స్వల్పకాలికంగా అప్ట్రెండ్ ఉంటుందని అంచనా వేస్తున్నట్టు విశ్లేషకులు తెలిపారు. పన్ను పోటుతో రిలయన్స్, ఓఎన్జీసీలు తీవ్రంగా నష్టపోయినా, ఇటీవల మార్కెట్కు నేతృత్వం వహిస్తున్న ఆటోమొబైల్ షేర్లతో హెవీవెయిట్ ఐటీసీ పెరగడం సూచీలకు కలిసివచ్చే అంశమని వారు చెపుతున్నారు.
సమీప రోజుల్లో 15, 950 స్థాయి వద్ద నిఫ్టీకి అవరోధం కలగవచ్చని, 15,630 సమీపంలో మద్దతు ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ షెట్టి తెలిపారు. 15,950పైన సూచీ స్థిరపడితే బుల్స్ మళ్లీ మార్కెట్లోకి ప్రవేశిస్తారన్నారు.
15,400 వద్ద ముఖ్యమైన 100 వారాల మూవింగ్ ఏవరేజ్ కదులుతున్నందున, ఈ స్థాయిని కోల్పోకపోతే 16,000 పాయింట్లను అందుకోవొచ్చని ఈక్విటీరీసెర్చ్ ఆసియా వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ అంచనా వేశారు. అటుపైన 16,350 వరకూ పెరిగే ఛాన్స్ ఉందన్నారు. రానున్న కొద్ది ట్రేడింగ్ సెషన్లలో నిఫ్టీ 15,500-15,900 శ్రేణిలోనే కన్సాలిడేషన్ జరిగేలా టెక్నికల్ సెటప్ కన్పిస్తున్నదని షేర్ఖాన్ విశ్లేషకుడు గౌరవ్ రత్నపార్కి వివరించారు.