ముంబై, అక్టోబర్ 20: హెచ్సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ తన ఉదారతను మరోమారు చాటుకున్నారు. ఈ ఏడాదికిగాను గురువారం విడుదలైన ఎడెల్గీవ్ హురున్ ఇండియా దాతృత్వ 9వ జాబితాలో రూ.1,161 కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు. సంవత్సర కాలంలో సగటున రోజుకు రూ.3 కోట్లకుపైగానే విరాళాలు ఇచ్చినట్టు తేలింది. ఇక గతంతో పోల్చితే విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ డొనేషన్లు ఏకంగా 95 శాతం పడిపోయి ఈసారి రూ.484 కోట్లకు పరిమితమయ్యాయి. అయినప్పటికీ టాప్-10లో రెండో స్థానంలో ఉన్నారు. కాగా, దేశంలోనే అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీ విరాళాలు కేవలం రూ.190 కోట్లుగానే ఉండటం గమనార్హం.
ఈ ఏడాది జాబితాలోకి కొత్తగా 19 మంది. వీరందరి విరాళాలు రూ.832 కోట్లు.
జాబితాలో ఆరుగురు మహిళలు. రూ.120 కోట్ల విరాళంతో రోహిణి నిలేకని టాప్.
ముంబైకి చెందినవారు అత్యధికంగా 33 మంది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూఢిల్లీ (16), బెంగళూరు (13).
దాతల్లో అత్యధికంగా 20 శాతం ఫార్మా రంగంవారే. 11 శాతంతో కెమికల్స్, పెట్రోకెమికల్స్ రంగాలవారున్నారు.
ఈ ఏడాది 44 రెట్లు పెరిగిన కరోనా రిలీఫ్ డొనేషన్లు. విద్యకే అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన దాతలు.