న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 10: రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులతో గత పక్షం రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ఎట్టకేలకు శాంతించింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.990 తగ్గి రూ.52,635గా ఉన్నది. అలాగే వెండి భారీగా తగ్గింది. కిలో ధర రూ.1,950 దిగొచ్చి రూ.69,450గా నమోదైంది. అంతకుముందు ఈ ధర రూ.71 వేలుగా ఉన్నది. అలాగే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,750 తగ్గి రూ.52,580కి దిగొచ్చింది. అలాగే 22 క్యారెట్ల ధర కూడా రూ.1,600 తగ్గి రూ.48,200 పలికింది. కిలో వెండి ఏకంగా రూ.2,600 తగ్గి రూ.74 వేలకు జారుకున్నది. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2 వేల డాలర్ల దిగువకు 1,983 డాలర్లకు పడిపోయింది. వెండి 25.50 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నది.
2021లో 1,067 టన్నుల గోల్డ్
పసిడి దిగుమతులు తిరిగి పుంజుకుంటున్నాయి. గతేడాది భారత్ 1,067.72 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నది. ఈ విషయాన్ని జెమ్ జ్యువెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) వెల్లడించింది. కరోనాతో 2020లో కేవలం 430.11 టన్నుల పసిడి మాత్రమే దిగుమతి అయింది. 2019లో దిగుమతి అయిన 836.38 టన్నులతో పోలిస్తే 27.66 శాతం అధికమని పేర్కొంది. భారత్లోకి దిగుమతైన పసిడిలో అత్యధికంగా స్విట్జర్లాండ్ నుంచి 469.66 టన్నులు అవగా, అలాగే యూఏఈ నుంచి 120.16 టన్నులు, దక్షిణాఫ్రికా నుంచి 71.68 టన్నులు అయినట్లు తెలిపింది.