Byju’s | ప్రముఖ ఎడ్ టెక్ సంస్థ ‘బైజూ’స్ అధినేత బైజూ రవీంద్రన్ తాజాగా మరో సమస్యలో చిక్కుకున్నారు. తక్షణం అత్యవసర సర్వ సభ్య సమావేశం (ఈజీఎం) ఏర్పాటు చేయాలని బైజూస్ ఇన్వెస్టర్ సంస్థలు పిలుపునిచ్చాయి. బైజూ’స్లో జనరల్ అట్లాంటిక్, ప్రోసస్ వెంచర్స్, పీక్ ఎక్స్వీ, చాన్ జుకర్ బర్గ్ ఇన్షియేటివ్ తదితర సంస్థలు గురువారం కంపెనీ యాజమాన్యానికి నోటీసు ఇచ్చాయి. తద్వారా కంపెనీ బోర్డును పునర్వ్యవస్థీకరించాలని, కంపెనీ సీఈఓగా ఉన్న సంస్థ కో-ఫౌండర్ రవీంద్రన్ను తొలగించాలని తలపోస్తున్నాయి.
కంపెనీ సీఈఓగా రవీంద్రన్కు వ్యతిరేకంగా ఇన్వెస్టర్ సంస్థలు ఒక్కటి కావడం ఇదే ప్రథమం. దీనికి రవీంద్రన్కు, బోర్డు సభ్యులకు మధ్య విభేదాలు పొడ సూపడమే కారణం. గతేడాది జూన్ నెలలో ప్రొసస్, పీక్ ఎక్స్ వీ పార్టనర్స్, చాన్ జుకర్బర్గ్ ఇన్షియేటివ్ ప్రతినిధులు.. బైజూ’స్ బోర్డు నుంచి తప్పుకున్నారు.
కంపెనీ భవితవ్యంపై ఇన్వెస్ట్ మెంట్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంస్థలో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. నోటీసు జారీ చేసిన సంస్థలకు బైజూ’స్లో 30 శాతం వాటా ఉంది. రవీంద్రన్, ఆయన భార్య దివ్య గోకుల్ నాథ్, సోదరుడు రిజు రవీంద్రన్ మినహా మిగతా బోర్డు సభ్యులంతా గతేడాదే వైదొలిగారు.