న్యూఢిల్లీ : పేదరికం, ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు సమ్మిళిత ఆర్థిక వృద్ధి కీలకమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. ఈ దిశగా భారత్ సుదీర్ఘ ప్రయాణం సాగించిందని చెప్పారు. అట్టడుగు వర్గాలకూ బ్యాంకు సేవలను అందుబాటులోకి తేవడం, ఆర్ధిక ఉత్పత్తులను చేరవేయడం ద్వారా సమ్మిళిత ఆర్ధిక వృద్ధి దిశగా అడుగులు పడ్డాయని అన్నారు. ఓ వాణిజ్య ఛానెల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్బీఐ గవర్నర్ గురువారం పాల్గొన్నారు.
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడంతో రాబోయే రోజుల్లో భారత ఆర్ధిక వ్యవస్ద గాడినపడుతుందని చెప్పారు.ఆర్ధిక వ్యవస్ధ రికవరీ దిశగా కీలక సంకేతాలు వెల్లడవుతున్నాయని అన్నారు. అయితే మార్కెట్లో డిమాండ్ ఇంకా జోరందుకోలేదని పేర్కొన్నారు. రుతుపవనం ఆశాజనకంగా ఉండటంతో ఈసారి వ్యవసాయ దిగుబడులు పెరిగి సరఫరాలు మెరుగవుతయాని చెప్పారు. సెకండ్ వేవ్తో తయారీ, సేవల రంగం రికవరీకి విఘాతం కలిగిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వివరించారు.