Bangladesh in Crisis | కరోనా మహమ్మారితోపాటు రాజకీయ అనిశ్చితి, పాలకుల ఏకపక్ష నిర్ణయాలతో భారత్ ఇరుగు పొరుగు దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. ఇప్పటికే శ్రీలంక పూర్తి ఆర్థికంగా దివాళా తీసింది. ఇక భారత్ దాయాది దేశం పాకిస్థాన్ దివాళా అంచులకు చేరుకున్నది. ఆ బాటలో మరో దేశం.. బంగ్లాదేశ్ పయనిస్తున్నది. దిగుమతులకు చెల్లింపుల కోసం విదేశీ మారక ద్రవ్యం నిల్వలు నిండుకుంటున్నాయి. వచ్చే మూడేండ్లలో 450 కోట్ల డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తలుపు తట్టింది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి పథంలో ప్రయాణిస్తున్న ఆర్థిక వ్యవస్థల్లో బంగ్లాదేశ్ ఒకటి. 416 బిలియన్ డాలర్ల జీడీపీతో అంతర్జాతీయంగా 33వ స్థానంలో కొనసాగుతున్నది. కానీ, బెయిలవుట్ ప్యాకేజీ కోసం ఐఎంఎఫ్ మెట్లెక్కడానికి కారణాలేమిటో తెలుసుకుందాం..
బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం, సర్వీస్ సెక్టార్లు జీవ నాడి వంటివి. కానీ, కరోనా మహమ్మారి వేళ సర్వీస్ రంగం దెబ్బతినడంతో 11 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 56 శాతం జీడీపీ పడిపోయింది. ఇక బంగ్లాదేశ్ ఎగుమతుల్లో రెడీమేడ్ దుస్తులు 84 శాతం వాటా కలిగి ఉంటాయి. కరోనా టైంలో ఆర్డర్లు రాకపోవడంతో గిరాకీ పడిపోయింది. ఆర్డర్లు తగ్గిపోగా.. వచ్చిన ఆర్డర్లు ఒక్కోసారి రద్దు కావడం, చెల్లింపుల్లో జాప్యం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయి.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం వల్ల గణనీయంగా ముడి చమురు రేట్లు పెరగడం బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు శాపంగా పరిణమించింది. దీంతో వాణిజ్య లోటు 33 బిలియన్ డాలర్లకు పెరిగిపోగా, విదేశీ మారక ద్రవ్యం నిల్వలు 40 బిలియన్ల డాలర్ల కంటే తగ్గిపోయాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్యం రిజర్వులు కొన్ని నెలలపాటు విదేశీ చెల్లింపులకే సరిపోతాయి.
దీనికితోడు ఇటీవల అమెరికా ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచడంతో బంగ్లాదేశ్ కరెన్సీ టకా కూడా పతనమైంది. గత మే నెలలో 86 టకాలు పలికిన డాలర్.. తాజాగా 94 టకాలకు చేరుకున్నది. ఈ పరిస్థితుల్లో ఎగుమతులు పుంజుకుని, విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెరిగితేనే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోగలదని ఆర్థికవేత్తలు అంటున్నారు.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్లో ఈ నెల ఐదో తేదీన పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఆక్టేన్ ధరలు భారీగా పెంచింది బంగ్లాదేశ్ సర్కార్. డీజిల్-కిరోసిన్లపై 42.5 శాతం, పెట్రోల్పై 51.1 శాతం, అక్టేన్పై 51.7 శాతం ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.130 టకాలు, డీజిల్-కిరోసిన్ ధర రూ.114 టకాలు, అక్టేన్ రూ.135లకు పెరగడంతో దేశ ప్రజలంతా ఆందోళన చేస్తున్నారు.
మరోవైపు, విదేశాల్లో నివసించే బంగ్లాదేశీయులు.. స్వదేశానికి పంపుతున్న నిధులు తగ్గుముఖం పట్టాయి. విదేశాల్లోని బంగ్లాదేశీయుల నుంచి స్వదేశానికి 2020-21లో 24.77 బిలియన్ డాలర్ల నిధులు వస్తే, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 21.03 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మాత్రమే కాదు.. ప్రపంచ బ్యాంకు తదితర ఆర్థిక సంస్థలు, బ్యాంకుల వద్ద రుణాల కోసం బంగ్లాదేశ్ సర్కార్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నది. ఐఎంఎఫ్ వద్ద 450 కోట్ల డాలర్లతోపాటు ప్రపంచ బ్యాంక్ వద్ద 100 కోట్ల డాలర్ల రుణాలకు ప్రయత్నిస్తున్నది. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ వద్ద కూడా రుణం కోసం యత్నిస్తున్నది.
కరోనా వ్యాక్సినేషన్ కోసం ప్రపంచ బ్యాంకు వద్ద 140 కోట్ల డాలర్ల రుణం తీసుకున్నది. ఇవి కాక దాదాపు 407 కోట్ల డాలర్ల రుణాలు తీసుకున్నట్లు సమాచారం. దీనికి తోడు దేశీయ ఆర్థిక వ్యవస్థ.. బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఇబ్బందుల్లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశీయంగా బ్యాంకులకు 1,111 కోట్ల డాలర్ల రుణాలు ఎగవేసినట్లు ప్రభుత్వమే చెబుతున్నది. కానీ, ఇది రెట్టింపు ఉండొచ్చునని ఐఎంఎఫ్ అనుమానిస్తున్నది.