హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): పారిశ్రామికవేత్తలు సంపద సృష్టికర్తలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార మల్లు అన్నారు. రాష్ట్రంలో సింగపూర్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. గురువారం ఆయన రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ కౌన్సిల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ బృందంతో సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో రాష్ట్ర ప్రభు త్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.
ఇకడ అన్ని వర్గాలకు అనుకూలమైన భౌగోళిక వాతావరణం, ప్రభుత్వ స్నేహపూర్వక విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలున్నాయని వివరించారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంతో హైదరాబాద్లో పెట్టుబడులు పెరిగాయన్నారు. తాజాగా రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టడంతోపాటు రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి క్లస్టర్ జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇటీవల జపాన్కు చెందిన జైకా.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినట్టు గుర్తుచేశారు.
సింగపూర్కు చెందిన పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని అంతకుముందు ఆ దేశ కౌన్సిల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తెలిపారు. అర్బన్ ప్లానింగ్ విషయంలో తమకు మంచి పట్టు ఉందని కూడా తెలియజేశారు. సింగపూర్కు చెందిన అతిపెద్ద బ్యాంక్ డీబీఎస్.. హైదరాబాద్లో పనిచేస్తున్నదన్న ఆయన.. ఇక్కడి ఐటీ పారులోనూ తమ దేశ ఆఫీసులున్న విషయాన్ని గుర్తుచేశారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, బయోటెక్ హబ్గా స్థిరపడుతున్నదని పేర్కొంటూ.. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుంటామని స్పష్టం చేశారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సచివాలయంలో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) కంపెనీ సీఎండీ శంతను రాయ్ తమ బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ కంపెనీ కార్యకలాపాల గురించి రాయ్ వివరించారు. మెట్రో రైల్ కోచ్ల తయారీ, రక్షణ, మైన్స్ వంటి రంగాల్లో తమ సంస్థ పని చేస్తున్నదని చెప్పారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో మెట్రో విస్తరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున తాము రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు తెలిపారు. దీంతో మెట్రో కోచ్ల తయారీలో బీఈఎంఎల్కున్న అనుభవాన్ని, వారి ఉత్పత్తుల నాణ్యతను గురించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్రంలో మెట్రో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడితే అందుకు అవసరమైన భూమిని కేటాయించడంతోపాటు అన్నిరకాలుగా సహకరిస్తామని సదరు సంస్థకు భరోసా ఇచ్చారు.