Stock Market | ముంబై, ఫిబ్రవరి 2: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. అయితే ఉదయం ఆరంభంలో ఉన్న జోష్.. ఆఖర్లో ముగింపు సమయానికి మాత్రం లేదు. కొనుగోళ్ల మద్దతుతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ ఒకానొక దశలో 1,444.1 పాయింట్లు లేదా 2 శాతానికి ఎగిసి 73,089.40 స్థాయిని తాకింది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) 429.35 పాయింట్లు లేదా 1.97 శాతం ఎగబాకి మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారి 22,126.80 వద్దకు వెళ్లింది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా నిఫ్టీ ఆల్టైమ్ హై రికార్డుల్లోకి వెళ్లడం ఇది ఐదోసారి. ఈసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్), ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్లు ఇన్వెస్టర్లను అమితంగా ఆకట్టుకోవడం కలిసొచ్చింది. కానీ ఇదే క్రమంలో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఈ ఉత్సాహం కాస్తా ఆవిరవుతూ వచ్చింది. చివరకు సెన్సెక్స్ 440.33 పాయింట్లు లేదా 0.61 శాతం పెరిగి 72,085.63 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 156.35 పాయింట్లు లేదా 0.72 శాతం అందుకుని 21,853.80 వద్ద నిలిచింది.
ఆయా రంగాలవారీగా చూస్తే.. చమురు-గ్యాస్ సూచీ 4.22 శాతం, ఎనర్జీ 3.44 శాతం, మెటల్ 2.95 శాతం, సర్వీసెస్ 2.22 శాతం, యుటిలిటీస్ 2.18 శాతం, ఐటీ 2.17 శాతం, పవర్ సూచీ 1.81 శాతం చొప్పున పెరిగాయి. పవర్గ్రిడ్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, విప్రో, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు కూడా భారీగా పుంజుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ బీఎస్ఈలో 2.18 శాతం ఎగిసి 2,914.75 వద్ద ముగిసింది. ఇంట్రా-డేలోనైతే 3.40 శాతం ఎగబాకి ఆల్టైమ్ హైని తాకుతూ రూ.2,949.90 వద్దకు చేరింది. ఇక ఎన్ఎస్ఈలోనూ 2 శాతం పెరిగి రూ.2,913 వద్ద స్థిరపడింది. మరోవైపు ఈ ర్యాలీతో సంస్థ మార్కెట్ విలువ ఈ ఒక్కరోజే రూ.41,860.54 కోట్లు పెరిగి రూ.19,72,028.45 కోట్లకు చేరింది.
‘మధ్యంతర బడ్జెట్ మార్కెట్పై ఏ రకంగానూ ప్రతికూల ప్రభావాన్ని చూపలేదు. ప్రీ-ఎలక్షన్ ర్యాలీ కొనసాగిందనే చెప్పుకోవచ్చు. కానీ ద్రవ్యలోటు లక్ష్యంలో అంత భారీ తగ్గుదల.. బాండ్ ఈల్డ్స్లో క్షీణతకు దారితీస్తుంది. ఫలితంగా కార్పొరేట్ రుణ వ్యయాలు తగ్గుముఖం పడుతాయి. అంతేగాక పెట్టుబడుల కోసం మరిన్ని ప్రోత్సాహకాలను ఇవ్వాల్సి వస్తుంది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిసెర్చ్ హెడ్ ఇనోద్ నాయర్ అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) దేశ జీడీపీలో ద్రవ్యలోటును 5.1 శాతానికి కట్టడి చేస్తామని గురువారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రకటన సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన విషయం తెలిసిందే. ఆపై ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను 4.5 శాతంగానే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) ద్రవ్యలోటును 5.8 శాతానికి అదుపు చేస్తామన్న విశ్వాసాన్ని మోదీ సర్కారు కనబరుస్తున్నది. నిజానికి నిరుడు బడ్జెట్ ప్రకటన సమయంలో ఈసారి జీడీపీలో ద్రవ్యలోటు 5.9 శాతంగా అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే ఒక్క ఏడాదిలో ద్రవ్యలోటును 0.7 నుంచి 0.8 శాతం మేర తగ్గించాలని చూడటం కూడా మంచిది కాదన్న అభిప్రాయాలు ఇప్పుడు మార్కెట్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఆసియాలోని ప్రధాన మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్ సూచీలు లాభాల్లో ముగియగా.. చైనా, హాంకాంగ్ సూచీలు నష్టపోయాయి. అమెరికా మార్కెట్లు గురువారం భారీ లాభాలను అందుకున్నాయి. ఐరోపాలోని కీలక సూచీలైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ సూచీలూ లాభాల్లోనే కదలాడుతున్నాయి. ఇదిలావుంటే బీఎస్ఈ మిడ్క్యాప్ సూచీ 0.80 శాతం, స్మాల్క్యాప్ సూచీ 0.49 శాతం చొప్పున పెరిగాయి. ఇక ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 1,384.96 పాయింట్లు లేదా 1.95 శాతం, నిఫ్టీ 501.2 పాయింట్లు లేదా 2.34 శాతం పుంజుకున్నాయి. గురువారం మాత్రం సెన్సెక్స్ 107 పాయింట్లు, నిఫ్టీ 28 పాయింట్లు నష్టపోవడం గమనార్హం. అంతేగాక విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) సైతం ఈక్విటీ మార్కెట్ల నుంచి ఈ ఒక్కరోజే రూ.1,879.58 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుపోయారు.