Stocks | అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలతో వరుసగా మూడు రోజులు నష్టాల్లో చిక్కుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఫైనాన్సియల్, ఐటీ స్టాక్స్ దన్నుతో సూచీలు పైపైకి దూసుకెళ్లాయి. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 496 పాయింట్లు (0.70శాతం) పెరిగి 71,683 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 160 పాయింట్లు (0.75శాతం) లబ్ధి పొంది 21,622 పాయింట్లతో ముగిసింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.05 లక్షల కోట్లు పుంజుకుని రూ.373.54 లక్షల కోట్లకు చేరుకున్నది. 2471 స్టాక్స్ లాభపడగా, 1334 స్టాక్స్ పతనం అయ్యాయి. 107 స్టాక్స్ యధాతథంగా కొనసాగాయి.
బీఎస్ఈ సెన్సెక్స్లో భారతీ ఎయిర్ టెల్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్ స్టాక్స్ 2-3.2 శాతం లాభ పడ్డాయి. మరోవైపు ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.8-3.2 శాతం మధ్య నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, పీఎస్ యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లు ఒక శాతానికి పైగా లబ్ధి పొందాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్ సారధ్యంలో నిఫ్టీ ఐటీ 0.9 శాతం పుంజుకున్నది. నిఫ్టీ మిడ్ క్యాప్ 1.52 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.1 శాతం లాభాలతో ముగిశాయి.