Stocks | అమెరికా రుణ పరపతిపై గ్లోబల్ రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ రేటింగ్ ‘ఏఏఏ’ నుంచి ఏఏ+’కు కుదించడంతో అంతర్జాతీయ మార్కెట్లతోపాటు దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. దేశీయ స్టాక్స్ పతనం కావడం వరుసగా మూడో రోజు. గురువారం స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 542 పాయింట్లు (0.82 శాతం) నష్టపోయి 65,241 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇంట్రాడే ట్రేడింగ్లో సెన్సెక్స్ 64,963 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయి ముగింపు సమయానికి కాసింత కోలుకున్నది.
మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం ట్రేడింగ్ ముగిసే సమయానికి 145 పాయింట్లు (0.74 శాతం) నష్టంతో 19,382 పాయింట్లతో సరిపెట్టుకున్నది. అంతర్గత ట్రేడింగ్లో 19,296 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది.
నిఫ్టీ-50లో 30 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. వాటిలో టైటాన్, బజాజ్ ఫిన్ సర్వ్, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్ల్టే ఇండియా, ఆల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ లైఫ్, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, హీరో మోటో కార్ప్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ స్టాక్స్ ఒక శాతం నుంచి 2.4 శాతం మధ్య పతనం అయ్యాయి.
బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.14 శాతం, స్మాల్ క్యాప్ 0.23 శాతం, నిఫ్టీ ఫార్మా, మీడియా ఇండెక్స్ లు ఒకశాతం చొప్పున లబ్ధి పొందగా, మిగతా సెక్టార్ ఇండెక్స్లు నష్టపోయాయి. ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లలో లిస్టయిన ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ గురువారం మధ్యాహ్నం వరకు 1.35 రెట్లు సబ్ స్క్రైబ్ అయ్యింది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఉదయం నుంచే నష్టాలతో ట్రేడింగ్ సాగింది. కేఎస్బీ, పీటీసీ ఇండస్ట్రీస్, స్టార్ సిమెంట్, పైసాలో డిజిటల్, దిలీప్ బిల్డ్ కాన్ సేర్లు లాభాల్లో కొనసాగాయి. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ భారీగా పతనమై.. ట్రేడింగ్ ముగిసే ముందు 82.74 వద్ద స్థిర పడింది. ఇక అమెరికా మారెట్లు.. డోజోన్స్, నాస్ డాక్, ఆస్ట్రేలియాకు చెందిన ఏఎస్ఎక్స్, షాంఘై కాంపోజిట్, హాంకాంగ్ కు చెందిన హాంగ్ సెంగ్, జపాన్ నిక్కీ కూడా నష్టపోయాయి.