ముంబై, మార్చి 25: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా నష్టపోయాయి. దేశంలో మరోసారి లాక్డౌన్ ప్రకటిస్తారన్న వార్తలతో మదుపరులు ఆందోళనకు గురయ్యారు. అమ్మకాలకు మొగ్గుచూపడంతో గురువారం సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. మరోవైపు డెరివేటివ్ కాంట్రాక్టు గడువు కూడా ముగియనుండటంతో సూచీల్లో తీవ్ర ఊగిసలాట నెలకొన్నది. మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల సూచీ సెన్సెక్స్ 740.19 పాయింట్లు (1.51%) తగ్గి 48,440.12 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 224.50 పాయింట్లు (1.54%) పతనమై 14,324.90 వద్ద స్థిరపడింది. మారుతి షేరు 4% క్షీణించి టాప్ లూజర్గా నిలిచింది. కేవలం డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎల్అండ్టీ షేర్లు లాభపడ్డాయి. ఫలితంగా మదుపరులు గత రెండు రోజుల్లో రూ.5 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బీఎస్ఈ లిస్టెడ్ సంస్థల మార్కెట్ విలువ రూ.200 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. ఫిబ్రవరి 3 తర్వాత ఇంత దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి.
రెండు రోజుల్లో 7 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్ల భారీపతనం మదుపరులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వరుసగా రెండు రోజుల్లో సెన్సెక్స్ 1,611 పాయింట్లకు పైగా నష్టపోవడంతో మదుపరులు రూ.7 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.7,00,591.47 కోట్లు కరిగిపోయి రూ.200 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. చివరకు రూ.1,98,75,470.43 కోట్లకు చేరుకున్నది.