Stock Markets | కీలక వడ్డీరేట్ల తగ్గింపుపై యూఎస్ ఫెడ్ రిజర్వుపై జాప్యం ప్రభావం శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. ఫైనాన్సియల్, ఆటో, ఐటీ స్టాక్స్ పతనం కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. మరోవైపు, మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఫలితాలు నామమాత్రంగా ఉండటంతో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ నష్టపోయాయి. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 454 పాయింట్లు (0.62శాతం) నష్టంతో 72,643 పాయింట్ల వద్ద ముగిస్తే, ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ 123 పాయింట్లు (0.56 శాతం) నష్టంతో 22,023 పాయింట్ల వద్ద స్థిర పడింది.
సెన్సెక్స్లో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్ స్టాక్స్ భారీగా 2-5 శాతం మధ్య పతనం కాగా, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టీసీఎస్ లాభాల్లో ముగిశాయి. అంచనాలకు మించి అమెరికా ద్రవ్యోల్బణం నమోదు కావడంతోపాటు యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లపై ప్రకటన చేయకపోవడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.5 శాతం నష్టపోయింది. దేశీయ ఐటీ కంపెనీల ఆదాయంలో ప్రధాన వాటా అమెరికా నుంచి వచ్చేదే కావడం గమనార్హం.
గురువారం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) షేర్లు 4-6 శాతం మధ్య నష్టపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్-100 స్టాక్స్ 0.46 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్-100 స్టాక్స్ 0.39 శాతం నష్టాలతో ముగిశాయి.
వన్97 కమ్యూనికేసన్స్ అనుబంధ సంస్థ పేటీఎం.. యూపీఐ సేవలు అందించేందుకు కేంద్రం థర్డ్ పార్టీ అప్లికేసన్ లైసెన్స్ మంజూరు చేసింది. దీంతో శుక్రవారం పేటీఎం షేర్లు ఐదు శాతం పెరిగాయి. శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.48 లక్షల కోట్లు కోల్పోయి రూ.378.5 లక్షల కోట్లకు పడిపోయింది.