Stocks in Green | నూతన సంవత్సరం తొలి రోజు సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు శుభారంభాన్ని అందుకున్నాయి. దేశీయ స్టాక్మార్కెట్లు కళకళలాడాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 929 పాయింట్ల లబ్ధితో 59,183 పాయింట్లకు చేరింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 271 పాయింట్లు లాభ పడి 17,625 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.266 లక్షల కోట్ల నుంచి రూ.269.95 లక్షల కోట్లకు చేరుకున్నది. శుక్రవారం గతేడాది చివరి రోజు కూడా మార్కెట్లు లాభాలతోనే ముగిశాయి.
సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ 57 పాయింట్ల లాభాలతో 58,310 పాయింట్ల వద్ద ప్రారంభమై ఇంట్రాడే ట్రేడింగ్లో గరిష్ఠ స్థాయి 59,266 పాయింట్లకు.. కనిష్ట స్థాయి 58,306 పాయింట్లకు పడిపోయింది. బీఎస్ఈ-30లో 26 షేర్లు లాభాలు పొందగా, నాలుగు స్క్రిప్ట్లు పతనం అయ్యాయి. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్స్ అత్యధికంగా 3.50 శాతం లబ్ధి పొందాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు 2 శాతానికి పైగా గెయిన్ అయ్యాయి. వీటితోపాటు విప్రో, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ షేర్లు లాభాలతో ముగిశాయి.
నెస్ట్లే, డాక్టర్ రెడ్డీస్ షేర్లతోపాటు టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్స్ భారీగా నష్టపోయాయి. 974 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్లో కొనసాగగా, 144 లోయర్ సర్క్యూట్లో ఉన్నాయి. అయితే ఇంట్రాడే ట్రేడింగ్లో ఆయా షేర్ల విలువల్లో పెద్ద తేడాలు కనిపించలేదు.
ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ -50లో 44 స్క్రిప్ట్లు లాభాలు పొందాయి. నిఫ్టీ బ్యాంకింగ్, ఫైనాన్సియల్ ఇండెక్స్లు 2.40 శాతం లాభ పడ్డాయి. మిడ్ క్యాప్, నెక్స్ట్ -50 స్క్రిప్ట్లు పతనం అయ్యాయి. టాటా మోటార్స్, కోల్ ఇండియా, మారుతి సుజుకి, ఎచిర్ లాభ పడ్డాయి. సిప్లా, డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా అండ్ మహీంద్రా స్క్రిప్ట్లు నష్టపోయాయి.