ముంబై, జనవరి 24: దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. వరుస నష్టాల నుంచి తేరుకుని బుధవారం లాభాలను అందుకున్నాయి. మెటల్, కమోడిటీ, టెలికం షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 689.76 పాయింట్లు లేదా 0.98 శాతం పుంజుకొని 71వేల స్థాయికి ఎగువన 71,060.31 వద్ద ముగిసింది. అయితే ఒకానొక దశలో 71,149.61 పాయింట్ల స్థాయికి ఎగిసిన సూచీ.. మరో దశలో 70,001.60 పాయింట్లకు పడిపోయింది. నిజానికి ఉదయం ఆరంభంలో మార్కెట్లు నష్టాల్లోనే మొదలయ్యాయి. సెన్సెక్స్ 316.75 పాయింట్లు క్షీణించింది. కానీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ నుంచి పెట్టుబడుల వైపు మళ్లడంతో పరిస్థితి మెరుగైంది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 215.15 పాయింట్లు లేదా 1.01 శాతం ఎగబాకి 21,453.95 వద్ద స్థిరపడింది. ఉదయం 60.70 పాయింట్లు కోల్పోయింది.
సెన్సెక్స్ షేర్లలో..
టాటా స్టీల్ 3.77 శాతం, హెచ్సీఎల్ టెక్ 3.62 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 3.60 శాతం, పవర్గ్రిడ్ 3.34 శాతం చొప్పున పెరగగా, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యునీలివర్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లూ పెరిగాయి. మంగళవారం భారీగా నష్టపోయిన జీ షేర్లు 6.70 శాతం పెరిగాయి. రంగాలవారీగా మెటల్ సూచీ 3.57 శాతం, టెలీకమ్యూనికేషన్స్ 3.21 శాతం, చమురు-గ్యాస్ 2.17 శాతం, కమోడిటీస్ 2.06 శాతం, ఎనర్జీ సూచీ 1.95 శాతం ఎగిశాయి. ఇక బీఎస్ఈ మిడ్క్యాప్ 1.71 శాతం, స్మాల్క్యాప్ 1.72 శాతం చొప్పున ఎగిశాయి.
గ్లోబల్ మార్కెట్లలో..
ఆసియా మార్కెట్లలో జపాన్ 0.80 శాతం నష్టపోతే, హాంకాంగ్ 3.56 శాతం, చైనా 1.80 శాతం మేర పెరిగాయి. ఐరోపా మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలూ లాభాల్లోనే కదలాడాయి. కాగా, విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) మంగళవారం రూ.3,115.39 కోట్ల పెట్టుబడుల్ని దేశీయ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకున్నారు. గత శనివారం, ఈ మంగళవారాల్లో అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. మంగళవారం ఒక్కరోజే బీఎస్ఈలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ రూ.8.50 లక్షల కోట్లు హరించుకుపోయిన సంగతీ విదితమే. నాడు సెన్సెక్స్ 1,053.10 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ కూడా 330.15 పాయింట్లు దిగజారింది.