ముంబై, జనవరి 5: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. ఐటీ, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం సూచీలకు కలిసొచ్చింది. ప్రారంభంలో తీవ్ర ఒత్తిడికి గురైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సంకేతాలతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా వారాంతం మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 178.58 పాయింట్లు అందుకొని 72,026.15 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 52.20 పాయింట్లు పెరిగి 21,710.80 వద్ద స్థిరపడింది. వారాంతం ట్రేడింగ్లో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయని, ఒక దశలో నష్టాల్లోకి జారుకున్న ఇరు సూచీలు చివర్లో కోలుకున్నాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.