ముంబై, ఏప్రిల్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ మరోసారి 60 వేల మార్కును దాటింది. 401.04 పాయింట్లు లేదా 0.67 శాతం ఎగిసి 60,056.10 వద్ద నిలిచింది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య 59,620.11 వద్దకు పడిపోయినా తిరిగి కోలుకున్నది. ఒకానొక దశలో 60,101.64 వద్దకు చేరడం విశేషం. ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలకు తగ్గట్టుగా ఉండటంతో కలిసొచ్చిందని ట్రేడింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 119.35 పాయింట్లు లేదా 0.68 శాతం పుంజుకొని 17,743.40 వద్ద స్థిరపడింది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ పెరగడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను బలపర్చిందంటున్నారు.
మెరిసిన బ్యాంకింగ్ షేర్లు
బ్యాంకింగ్ షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే బ్యాంకింగ్ సూచీ అత్యధికంగా 1 శాతం పెరిగింది. ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. విప్రో, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ, హెచ్సీఎల్ టెక్, రిలయన్స్ షేర్ల విలువ కూడా ఎగిసింది. రంగాలవారీగా చూస్తే.. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, కమోడిటీస్, ఎనర్జీ, టెక్నాలజీ షేర్లు ఎగబాకాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ 0.47 శాతం, స్మాల్క్యాప్ 0.34 శాతం పెరిగాయి. కాగా, గతకొన్ని సెషన్లుగా అమ్మకాల ఒత్తిడి కనిపిస్తున్నప్పటికీ.. నెలసరి ఎఫ్అండ్వో గడువు ముగుస్తుండటంతో మదుపరులు కొత్త పెట్టుబడులకు తెరతీశారని కొటక్ సెక్యూరిటీస్ చెందిన ఈక్విటీ రిసెర్చ్ రిటైల్ అధిపతి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు.
గ్లోబల్ మార్కెట్లలో..
ఆసియా మార్కెట్లలో మిశ్రమ స్పందన కనిపించింది. ప్రధాన సూచీల్లో జపాన్ లాభాల్లో ముగియగా, చైనా, హాంకాంగ్ నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి. అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిసి గత వారానికి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.