ఆటో, ఎనర్జీ, మెటల్ స్టాక్స్ దన్నుతో సోమవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ.. తమ జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో సానుకూల ధోరణితో ఇండెక్స్లు దూసుకెళ్తున్నాయి. ఆటో, ఎనర్జీ, మెటల్ స్టాక్స్ దన్నుతో సోమవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ.. తమ జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్లో 74,869.3 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లి, ట్రేడింగ్ ముగిసే సమయానికి 494.28 పాయింట్ల లాభంతో 74,742.50 పాయింట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 22,697.30 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లి ట్రేడింగ్ ముగిసే సమయానికి 152.60 పాయింట్ల లాభంతో 22,660.95 పాయింటల వద్ద ముగిసింది.
సోమవారం ట్రేడింగ్ సాగుతుండగా ఉదయం 10.34 గంటల సమయంలో ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.400 లక్షల కోట్ల మార్కును దాటేసింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.400 లక్షల కోట్ల మైలురాయిని దాటడం ఇదే మొదటిసారి. సంప్రదాయ పెట్టుబడి మార్గాల నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు తమ ఆదాయాన్ని స్టాక్ మార్కెట్లలోకి మళ్లించడంతో బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ కేవలం తొమ్మిది నెలల్లో రూ.100 కోట్ల మార్కును దాటింది.
సెన్సెక్స్ లో మారుతిసుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ షేర్లు లాభ పడ్డాయి. నెస్లే ఇండియా, విప్రో, సన్ ఫార్మా, హెచ్సీఎల్ టెక్, టైటాన్ షేర్లు నష్టపోయాయి. నాస్ డాక్, ఎస్ అండ్ పీ-500 ఇండెక్స్ లు ఒక శాతానికి పైగా లాభ పడటం, క్రూడాయిల్ బ్యారెల్ ధర 89 డాలర్లు పలుకడం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వడం, నాలుగో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు ఆశావాహంగా ఉండటంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపడింది.