ముంబై, నవంబర్ 2: స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ తీసుకున్న నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లు దౌడ్ తీశాయి. దీంతో వరుసగా రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన దేశీయ సూచీలు భారీగా లాభపడ్డాయి. ఇంట్రాడేలో 600 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ తిరిగి 64 వేల పాయింట్ల పైకి చేరుకున్నది. చివరకు 489.57 పాయింట్లు లాభపడి 64,080.90 వద్ద ముగిసింది.
అటు మరో సూచీ నిఫ్టీ కూడా 144.10 పాయింట్లు అందుకొని 19, 133.25 వద్ద ముగిసింది. గత రెండు సెషన్లలో సెన్సెక్స్ 521 పాయింట్లు, నిఫ్టీ 152 పాయింట్లు నష్టపోయిన విషయం తెలిసిందే. ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడంతో పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ను మెరుగుపరిచిందని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. అమెరికా బాండ్ ఈల్డ్ భారీగా పడిపోవడం కూడా మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చాయి. జీఎస్టీ వసూళ్లు పుంజుకోవడం, కీలక రంగాలు ఆశాజనకంగా ఉండటమూ కలిసొచ్చాయి.