ముంబై, ఫిబ్రవరి 6 : దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. రిజర్వుబ్యాంక్ తన పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ తీసుకున్న నిర్ణయంతో తొలుత అమ్మకాలకు మొగ్గుచూపిన మదుపరులు.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో మధ్యాహ్నం తర్వాత తిరిగి కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఇంట్రాడేలో 82,925 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 83,580.40 వద్ద ముగిసింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే 266.47 పాయింట్లు బలపడింది. మరో సూచీ నిఫ్టీ 50.90 పాయింట్లు అందుకొని 25,693.70 వద్ద నిలిచింది. రిజర్వుబ్యాంక్ నిర్ణయం అంచనావేసినట్టుగా ఉండటంతో వడ్డీరేట్లకు సంబంధించిన రంగాలు షేర్లు తీవ్ర ఊగిసలాటలో ట్రేడయ్యాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్ లిమెటెడ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లకు రుణాలు ఇవ్వడానికి బ్యాంక్లకు సెంట్రల్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆర్థిక సంస్థల షేర్లు తీవ్ర ఒత్తిడికి గురైనప్పటికీ వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి సూచీలు లాభాల్లోకి వచ్చాయి.
అంతర్జాతీయంగా కృత్రిమ మేధస్సు వినిమయం భారీగా పుంజుకుంటుండటంతో గ్లోబల్ మార్కెట్లో ఐటీ సంస్థల షేర్లు తీవ్ర ఆటుపోటులను ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా దేశీయ మార్కెట్లోనూ వరుసగా మూడో రోజూ ఈ సూచీలు భారీగా నష్టపోయాయి. హెక్సావేర్ టెక్నాలజీ షేరు 4.14 శాతం తగ్గి టాప్ లూజర్గా నిలిచింది. దీంతోపాటు ఎల్టీఐమైండ్ట్రీ 2.26 శాతం, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 2.24 శాతం, టీసీఎస్ 1.69 శాతం, టెక్ మహీంద్రా 1.69 శాతం, విప్రో 1.14 శాతం, ఇన్ఫోసిస్ షేరు కూడా నష్టపోయింది.