ముంబై, జనవరి 18: రికార్డుస్థాయి నుంచి మొదలైన మార్కెట్ పతనం వరుసగా మూడోరోజైన గురువారం సైతం కొనసాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ మరో 315 పాయింట్ల నష్టాన్ని మూటకట్టుకుని 71,187 పాయింట్ల వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 21,462 పాయింట్ల వద్ద నిలిచింది. ట్రేడింగ్ తొలిదశలో సెన్సెక్స్ 835 పాయింట్లు పతనమై 70,665 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకగా, నిఫ్టీ 286 పాయింట్లు పడిపోయి 21,285 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని చూసింది.
అయితే మధ్యాహ్న సెషన్ తర్వాత రిలయన్స్, సన్ఫార్మా, ఎల్ అండ్ టీలతో పాటు కొన్ని ఐటీ షేర్లలో షార్ట్ కవరింగ్ జరగడంతో సూచీలు నష్టాల్ని పరిమితం చేసుకున్నాయి. మొత్తం మూడు రోజుల్లో సెన్సెక్స్ 2,141 పాయింట్లు, నిఫ్టీ 635 పాయింట్ల చొప్పున కోల్పోయాయి. ఇంట్రాడే కనిష్ఠ నుంచి సూచీలు కోలుకున్నా, బలహీన గ్లోబల్ సంకేతాల కారణంగా నష్టాలతో ముగిసాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
యూఎస్లో రిటైల్ అమ్మకాలు జోరుగా ఉన్నట్టు డాటా వెలువడటం, గ్లోబల్ బాండ్ ఈల్డ్స్ పెరగడంతో ఫెడ్ వడ్డీ రేట్లు త్వరితంగా తగ్గబోవన్నఅంచనాల్ని ఇన్వెస్టర్లు ఏర్పర్చుకుంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో కొన్ని రంగాల షేర్లను విక్రయించి, మరికొన్నింటిలో కొనుగోళ్లు జరుపుతున్నారని వివరించారు.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ టాప్ లూజర్
కీలకమైన ప్రధాన షేర్లు లాభాల్లోకి మళ్లినప్పటికీ, సూచీల నష్టాల ముగింపునకు ప్రధాన కారణం త్రైమాసిక ఫలితాలతో ఇన్వెస్టర్లను నిరాశపర్చిన హెవీవెయిట్ షేరు హెచ్డీఎఫ్సీ బ్యాంకే కావడం గమనార్హం. దాదాపు 15 శాతం వెయిటేజీ ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సెన్సెక్స్లో 305 పాయింట్లను నష్టపర్చింది. బుధవారం 8 శాతం తగ్గిన ఈ షేరు తాజాగా మరో 3.26 శాతం నష్టాన్ని చవిచూసింది. ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, పవర్గ్రిడ్, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే, మారుతిలు 1-2 శాతం మధ్య క్షీణించాయి.
మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ఫార్మా, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, లార్సన్ అండ్ టూబ్రోలు 1-2 శాతం మేర పెరిగాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 2.07 శాతం తగ్గింది. యుటిలిటీస్ 1.70 శాతం, పవర్ 1.30 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.82 శాతం చొప్పున క్షీణించాయి. ఎనర్జీ, హెల్త్కేర్, టెలికమ్యూనికేషన్స్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు పెరిగాయి.
కన్సాలిడేషన్కు అవకాశం
మూడు రోజుల్లో జరిగిన భారీ పతనం కారణంగా ఒకటి, రెండు రోజులు నిఫ్టీ పరిమితశ్రేణిలో కన్సాలిడేట్ కావచ్చని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అంచనా వేశారు. 21,700-21,850 స్థాయికి పెరిగితే అమ్మకాలు వెల్లువెత్తవచ్చని, నిఫ్టీకి తదుపరి కీలక మద్దతు 21,200 సమీపంలో ఉన్నదని విశ్లేషించారు.
ఎఫ్పీఐల విక్రయాలు రూ.20వేల కోట్లు
వరుసగా రెండు రోజుల్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారీగా రూ. 20,000 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించారు. బుధవారం రూ. 10,578 కోట్లు వెనక్కు తీసుకున్న ఎఫ్పీఐలు గురువారం మరో రూ. 9,900 కోట్ల విలువైన షేర్లను ఆఫ్లోడ్ చేశారు.