Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం ప్రారంభ లాభాలు హరించుకుపోయాయి. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో గత ఆర్థికసంవత్సరం మార్చి త్రైమాసికం ఫలితాలు బలహీనంగా నమోదు కావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బ తిన్నది. పలు ఆసియా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. కాకపోతే, పలువురు ఆర్థికవేత్తల అంచనాలకు ప్రతిబింబంగా చైనా ఆర్థిక వృద్ధిరేటు 4.5 శాతానికి చేరుతుందని అధికారిక గణాంకాలు వెలువడటం ఊరట. గతవారం వరుసగా తొమ్మిది సెషన్లలో లాభాలతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇవ్వడంతో వరుసగా రెండో రోజు స్టాక్స్ మీద అమ్మకాల ఒత్తిడి పడింది.
మంగళవారం ట్రేడింగ్ మొదలైన కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఏ దశలోనూ ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో ప్రధాన స్టాక్స్ ఇంట్రా డే కనిష్ట స్థాయికి పతనం అయ్యాయి. విద్యుత్, టెలికం స్టాక్స్ నష్టపోగా, రియాల్టీ, ఫార్మా షేర్లు మెరుగ్గా ట్రేడ్ కావడంతో నష్టాలు కొంత మేరకే పరిమితం అయ్యాయి.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ మంగళవారం ఉదయం 59,991.26 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో మొదలైంది. ఇంట్రాడే ట్రేడింగ్లో సెన్సెక్స్ 60,113.47 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లి.. 59,579.30 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 183.74 పాయింట్లు పతనమై 59,727.01 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఇంట్రా డే ట్రేడింగ్లో 17,766.60 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకి.. తిరిగి 17,610.20 కనిష్ట స్థాయికి పడిపోయింది. ట్రేడింగ్ ముగింపు సమయానికి 46.70 పాయింట్ల పతనంతో 17,660.15 పాయింట్ల వద్ద నిలిచింది. ఇక ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ రూ.82.04 దగ్గర నిలిచింది.
ఇక సెన్సెక్స్లో హెచ్సీఎల్ టెక్, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, నెస్ట్లే ఇండియా, సన్ఫార్మా, మారుతీ, ఎల్అండ్టీ, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, ఎస్బీఐ షేర్లు లబ్ధి పొందాయి. పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, రిలయన్స్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐటీసీ తదితర షేర్లు భారీగా నష్టపోయాయి.