Stocks in Loss | శుక్రవారం దేశీయ స్టాక్మార్కెట్లలో సెన్సెక్స్లో ప్రారంభ లాభాలు హరించుకుపోయాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్టాక్స్ స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్ సంస్థలు నష్టాలను చవి చూశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 137 పాయింట్లు నష్టపోయి 52,793 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 26 పాయింట్ల నష్టంతో 15,782 పాయింట్ల వద్ద స్థిర పడ్డాయి. నిఫ్టీలో టాటా మోటార్స్, సన్ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందూస్థాన్ యూనీ లివర్, టైటాన్ తదితర స్క్రిప్ట్లు లబ్ధి పొందగా, హిందాల్కో, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ భారీగా నష్టపోయాయి.
మార్చితో ముగిసిన త్రైమాసికంలో టాటా మోటార్స్ నికర నష్టాలను రూ.7605 కోట్ల నుంచి రూ.1,033 కోట్లకు తగ్గించుకోవడంతో ఆ సంస్థ షేర్ ఎనిమిది శాతం లాభ పడింది. ఎన్ఎస్ఈలో ఎస్బీఐ స్క్రిప్ట్ 4.8 శాతం నష్టంతో రూ.440.50 వద్ద స్థిర పడింది. మార్చి త్రైమాసికంలో రూ.10 వేల కోట్ల నికర లాభాలు గడిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేయగా, ఎస్బీఐ 41 శాతం వృద్ధితో రూ.9,113.50 కోట్ల నికర లాభం గడించింది. నికర ఆదాయం 15.3 శాతం పెరిగి రూ.31,198 కోట్లకు చేరుకుంది.
నిఫ్టీ స్మాల్క్యాప్-100, నిఫ్టీ మిడ్ క్యాప్-100 ఇండెక్స్లు ఒకశాతం లాభంతో ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్, మెటల్ ఇండెక్స్లు 1-2 శాతం నష్టాలతో ముగిస్తే నిఫ్టీ ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటో ఇండెక్స్లు 1.6-2 శాతం మధ్య లాభం పొందాయి. కరోనా అనంతర రికవరీని ఉక్రెయిన్-రష్యా యుద్ధం దెబ్బ తీయగా, అధిక వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బ తీశాయి.