ముంబై, డిసెంబర్ 26: వివిధ కారణాలతో నాలుగు రోజుల నుంచి నిలువునా పతనమైన స్టాక్ సూచీలు సోమవారం కోలుకున్నాయి. ఫైనాన్షియల్, ఐటీ, మెటల్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 721 పాయింట్లు రికవరీ అయ్యి తిరిగి 60 వేలకు ఎగువన 60,566 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది 988 పాయింట్ల వరకూ పెరిగినప్పటికీ, ముగింపులో కొంతమేర లాభాలను కోల్పోయింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 208 పాయింట్లు ర్యాలీ జరిపి 18 వేలకు ఎగువన 18,015 పాయింట్ల వద్ద నిలిచింది. ఈ ఒక్కరోజు ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ.5.8 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ. 277.9 లక్షల కోట్లకు చేరుకుంది.