ముంబై, ఆగస్టు 19: దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస లాభాలకు బ్రేక్ పడింది. శుక్రవారం సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ మళ్లీ 60వేల దిగువకు పడిపోయింది. 651.85 పాయింట్లు లేదా 1.08 శాతం క్షీణించి 59,646.15 వద్ద నిలిచింది. అంతకుముందు 5 రోజులు సెన్సెక్స్ లాభాలను అందుకున్న విషయం తెలిసిందే. అయితే మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేయడంతో నష్టాలు తప్పలేదు. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 8 రోజుల వరుస లాభాల జోష్ను విడాల్సి వచ్చింది. ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో 198.05 పాయింట్లు లేదా 1.10 శాతం దిగజారి 17,758.45 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్లో ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ విలువ అత్యధికంగా 3.82 శాతం పతనమైంది. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, మారుతి, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్యూఎల్ షేర్లూ నిరాశపర్చాయి.
కోలుకోని రూపాయి
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ నష్టపోతూనే ఉన్నది. శుక్రవారం ట్రేడింగ్లో 20 పైసలు దిగజారి 79.84 వద్ద నిలిచింది. ఉదయం ఆరంభం నుంచే అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న దేశీయ కరెన్సీ.. చివరిదాకా అదే బాటలో నడిచింది. వడ్డీరేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చిన సంకేతాలు డాలర్ సూచీని పరుగులు పెట్టించాయని ఫారెక్స్ ట్రేడర్లు చెప్తున్నారు.