మరో 287 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
ముంబై, సెప్టెంబర్ 30: ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో వరుసగా మూడోరోజు భారత స్టాక్ సూచీలు క్షీణించాయి. గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 287 పాయింట్ల నష్టంతో 59,136 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో మొత్తంమీద మూడురోజుల్లో సెన్సెక్స్ 952 పాయింట్లు నష్టపోయినట్లయ్యింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ మూడు ట్రేడింగ్ సెషన్లలో 237 పాయింట్లు కోల్పోయింది. ఈ సూచి తాజాగా 93 పాయింట్ల నష్టంతో 17,618 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా పవర్గ్రిడ్ 2.67 శాతం క్షీణించగా, ఆసియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఎస్బీఐ, కొటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మహింద్రాలు 1-2 శాతం మధ్య నష్టపోయాయి. మరోవైపు బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, సన్ఫార్మా, హెచ్యూఎల్, టైటాన్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు 2.19 శాతం వరకూ లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ రియల్టీ, కన్జూమర్ డ్యూరబుల్స్, యుటిలిటీస్, వపర్, హెల్త్కేర్ ఇండెక్సలు పెరిగాయి. బ్యాంకెక్స్, మెటల్, టెలికం, టెక్నాలజీ ఇండెక్స్లు తగ్గాయి.
ఇన్వెస్టర్ల జాగ్రత్త…
చైనా రియల్టీ దిగ్గజం ఎవర్గ్రాండే పరిస్థితిని ఇన్వెస్టర్లు ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని, దాంతో మార్కెట్లు తగ్గుతున్నాయని అశికా స్టాక్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ అరిజిత్ మలేకర్ చెప్పారు. ఎవర్గ్రాండే ఈ నెల 28న మరోదఫా బాండ్ల చెల్లింపుల్లో విఫలమయ్యింది.