Sensex | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్లో నష్టాల్లోనే ముగిశాయి. అదానీ గ్రూప్కు చెందిన నాలుగు సంస్థల రేటింగ్ను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ స్టేబుల్ నుంచి నెగెటివ్కు మార్చడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. ఇన్వెస్టర్లలో తిరిగి విశ్వాసం కల్పించేందుకు రెవెన్యూ గ్రోత్ లక్ష్యాలపై కోత విధించడంతోపాటు తాజాగా పెట్టుబడి వ్యయాలను తగ్గిస్తామని అదానీ గ్రూప్ ప్రకటించింది.
గత నెలలో హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక వెల్లడైనప్పటి నుంచి ఇప్పటి వరకు అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ 120 బిలియన్ డాలర్లకు పై చిలుకు ఆవిరైపోయింది. దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలపై ఆందోళనతోపాటు అంతర్జాతీయ పరిణామాలతో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 0.41 శాతం, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 0.48 శాతం నష్టాలతో ముగిశాయి.
సోమవారం ఉదయం 60,652.82 పాయింట్ల వద్ద ఫ్లాట్గా మొదలైన బీఎస్ఈ సెన్సెక్స్ ట్రేడింగ్.. అంతర్గత ట్రేడింగ్లో 60,740.95 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లి, తిరిగి 60,245.05 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 250.86 పాయింట్లు కోల్పోయి 60.431.84 పాయింట్ల వద్ద ముగిసింది.
మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ట్రేడింగ్ 17,859.10 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రా డే ట్రేడింగ్లో 17,880.70 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లి.. 17,719.75 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. ముగింపు సమయానికి 85.60 పాయింట్ల నష్టంతో 17,770.90 పాయింట్ల వద్ద నిలిచింది.
అన్ని సెక్టార్ల ఇండెక్స్లు.. ఐటీ, మెటల్, రియాల్టీ, మీడియా, పీఎస్యూ బ్యాంకులు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ మాత్రం ఫ్లాట్గా ముగిసింది. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ రూ.82.71 వద్ద నిలిచింది.
మూడీ`స్ రేటింగ్ డౌన్గ్రేడ్ చేయడంతో బీఎస్ఈ సెన్సెక్స్లో అదానీ స్టాక్స్ భారీగానే నష్టపోయాయి. అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ 7.5 శాతం, అదానీ పోర్ట్స్ 5.5 శాతం పతనం అయ్యాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ విల్మార్ స్టాక్స్ లోయర్ సర్క్యూట్ను తాకాయి.
ఇంకా ఎస్బీఐ, ఇన్ఫోసిస్ 2.5 శాతానికి పైగా, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, విప్రో, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా స్క్రిప్ట్లు పతనం అయ్యాయి. మరోవైపు టైటాన్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, సన్ఫార్మా, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, ఎచిర్ మోటార్స్ లాభాలతో ముగిశాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది. అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాల అప్డేట్తో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు మరింత పెంచుతుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. జపాన్ నిక్కీ నష్టాలతోనే ముగిసింది. టెక్నాలజీ సంస్థల లాభాలు తక్కువగా నమోదు కావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్పై ప్రభావం పడింది. ఫలితంగా నిక్కీ షేర్లు 0.88 శాతం నష్టాలతో ముగిశాయి.