Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో ప్రతికూలంగా ట్రేడింగ్ ప్రారంభమైన.. తర్వాత కొంత కోలుకున్నాయి. కానీ పెరిగిన లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి. ఆటోమొబైల్, మెటల్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ భారీ పతనం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు దేశీయ ఇండెక్స్లపై ప్రభావం చూపాయి. అమెరికా డాలర్ మీద రూపాయి మారకం విలువ బలహీనత దీనికి తోడైంది.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ సోమవారం ఉదయం 65,787.51 పాయింట్ల వద్ద నష్టాలతోనే ప్రారంభమై అంతర్గత ట్రేడింగ్ లో 65,844.01 ఆల్ టైం గరిష్ట స్థాయికి దూసుకెళ్లి 65,547.80 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 139.58 పాయింట్ల పతనంతో సెన్సెక్స్ 65,655.15 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఈఎస్ సూచీ నిఫ్టీ 19,731.15 పాయింట్ల వద్ద మొదలైన ట్రేడింగ్.. అంతర్గత ట్రేడింగ్ లో 19,756 పాయింట్లతో గరిష్టానికి దూసుకెళ్లి.. తిరిగి 19,670.50 పాయింట్ల వద్దకు పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 37.80 పాయింట్ల పతనంతో 19,694 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదిలా ఉంటే ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మీద రూపాయి మారకం విలువ రూ.83.35 వద్ద స్థిర పడింది.
ఇక బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్లో భారతీ ఎయిర్ టెల్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్, మారుతి సుజుకి, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) షేర్లు పుంజుకున్నాయి. బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, హెచ్యూఎల్, ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి.