ముంబై, జూన్ 22: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా రెండు రోజులు లాభాల్లో కదలాడిన సూచీలు.. బుధవారం పడిపోయాయి. గత వారం మొత్తం కూడా క్షీణించిన విషయం తెలిసిందే. కాగా, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిళ్ల మధ్య మదుపరులు లాభాల స్వీకరణకు ప్రాధాన్యతనిచ్చారని నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 709.54 పాయింట్లు లేదా 1.35 శాతం దిగజారి 51,822.53 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 225.5 పాయింట్లు లేదా 1.44 శాతం కోల్పోయి 15,413.2 వద్ద స్థిరపడింది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం, తరలిపోతున్న విదేశీ మదుపరుల పెట్టుబడులూ.. మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయని ట్రేడర్లు చెప్తున్నారు.
సెన్సెక్స్ షేర్లలో టాటా స్టీల్ షేర్ విలువ అత్యధికంగా 5.24 శాతం పడిపోయింది. విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్ షేర్లూ మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి. టీసీఎస్, హెచ్యూఎల్, పవర్గ్రిడ్, మారుతి మినహా మిగతా సెన్సెక్స్ షేర్లన్నీ నష్టాలకే పరిమితమయ్యాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ 1.53 శాతం, స్మాల్క్యాప్ 1.11 శాతం చొప్పున క్షీణించాయి. రంగాలవారీగా మెటల్, రియల్టీ, కన్జ్యూమర్ గూడ్స్, పవర్ షేర్లు నిరాశపరిచాయి.
ఆసియా మార్కెట్లలో ప్రధానమైన హాంకాంగ్, దక్షిణ కొరియా, చైనా, జపాన్ సూచీలు నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలో కీలకమైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ సూచీలూ నష్టాల్లోనే కదలాడుతున్నాయి. ఈ ప్రభావం భారతీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. మంగళవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిసినా.. దేశీయ మదుపరులను కొనుగోళ్లవైపు నడిపించలేకపోయాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాల నడుమ నిఫ్టీ మరింతగా క్షీణించవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆఖరుకల్లా 14,500ల స్థాయికి పడిపోవచ్చని అమెరికన్ బ్రోకరేజీ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా వేస్తున్నది. గ్లోబల్ క్రూడాయిల్ మార్కెట్లో ఒడిదుడుకులు, ఇతరత్రా దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితులు నిఫ్టీ షేర్ల విలువకు గండి కొడతాయన్నది. ఇంతకుముందు ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిఫ్టీ 19,100 స్థాయికి పెరుగుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా వేసినది
తెలిసినదే.