ముంబై, ఏప్రిల్ 22: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. వచ్చే నెలలో వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచుతామన్న సంకేతాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నుంచి రావడం ఒక్కసారిగా మార్కెట్లో అలజడికి కారణమైంది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 714.53 పాయింట్లు లేదా 1.23 శాతం పతనమై 57,197.15 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 220.65 పాయింట్లు లేదా 1.27 శాతం క్షీణించి 17,171.95 వద్ద నిలిచింది. ఇక సెన్సెక్స్ షేర్లలో ఎస్బీఐ విలువ అత్యధికంగా 3.08 శాతం పడిపోయింది. హెచ్యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లూ నిరాశపరిచాయి. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 0.98 శాతం వరకు లాభాలను అందుకున్నాయి. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. సూచీ రెండు రోజుల వరుస లాభాలను కొనసాగించడంలో విఫలమైంది. చివరకు బీఎస్ఈ మిడ్క్యాప్ 0.71 శాతం, స్మాల్క్యాప్ 0.38 శాతం మేర దిగజారాయి.
ఆరంభం నుంచీ అమ్మకాల ఒత్తిడే
స్టాక్ మార్కెట్లు ఉదయం ప్రారంభమైన దగ్గర్నుంచీ నష్టాల్లోనే కొనసాగాయి. ఐటీ, బ్యాంకింగ్, మెటల్, ఫైనాన్స్, హెల్త్కేర్, బేసిక్ మెటీరియల్స్, ఇంధన షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఈ నష్టాలకు దారితీసిందని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం, విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణలూ నష్టాల తీవ్రతను పెంచినట్టు చెప్తున్నారు. రూపాయి విలువ 32 పైసలు పడిపోగా 76.49 వద్దకు చేరింది. గురువారం విదేశీ సంస్థాగత మదుపరులు రూ.713.69 కోట్ల విలువైన షేర్లను అమ్మేసినట్టు స్టాక్ ఎక్సేంజ్ వర్గాలు తెలిపాయి. ఇక ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 1,141.78 పాయింట్లు లేదా 1.95 శాతం, నిఫ్టీ 303.70 పాయింట్లు లేదా 1.73 శాతం నష్టపోయాయి.
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లూ డీలా
అంతర్జాతీయంగా ప్రధాన స్టాక్ మార్కెట్లలో మెజారిటీ సూచీలు నష్టాలకే పరిమితమయ్యాయి. ఆసియా దేశాల్లో జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా సూచీలు నష్టపోగా, చైనా మాత్రం లాభాల్లో ముగిసింది. ఐరోపాలోనూ కీలక సూచీలు డీలా పడ్డాయి. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ మార్కెట్లు నష్టాల్లోనే కదలాడాయి. అమెరికా సూచీలూ ఇంతేనని గణాంకాలు చెప్తున్నాయి.