Investers Wealth | దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం రక్తమోడాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ ఒక్కరోజు ట్రేడింగ్లో 1457 పాయింట్లు నష్టపోయింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 16వేల మార్క్ దిగువకు పడిపోయింది. ఫలితంగా రూ.6.32 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి ఒకే రోజు సెన్సెక్స్ భారీగా పతనం కావడం ఇదే తొలిసారి.
సెన్సెక్స్ సోమవారం ఇంట్రా డే ట్రేడింగ్లో దాదాపు 1800 పాయింట్లు నష్టపోయింది. చివరకు 1457 పాయింట్లు (2.68 శాతం) నష్టపోయి 52,847 పాయింట్ల వద్ద స్థిర పడింది. నిఫ్టీ 427 పాయింట్ల (2.64 శాతం) నష్టంతో 15,774.40 పాయింట్లతో సరిపెట్టుకున్నది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతోపాటు అమెరికా ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచుతాయన్న వార్తలు ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ను బలహీన పరిచాయి.
ఆసియాలోని సియోల్, టోక్యో, హాంకాంగ్, షాంఘై మార్కెట్లలో భారీ నష్టాలు చోటు చేసుకున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం 3,973.95 కోట్ల విలువైన షేర్లను విక్రయించేశారు. శుక్రవారం అమెరికాలోని స్టాక్ మార్కెట్లు దిగువన ముగిశాయి.