ముంబై, డిసెంబర్ 20: కొద్ది రోజులుగా జరిగిన భారీ ర్యాలీలో ఆర్జించిన లాభాల్ని నగదుగా మార్చుకునేందుకు ఒక్కసారిగా ఇన్వెస్టర్లు ఎగబడటంతో బుధవారం మార్కెట్ హఠాత్ పతనాన్ని చవిచూసింది. ట్రేడింగ్ ప్రారంభంలో భారీగా పెరిగిన స్టాక్ సూచీలు మధ్యాహ్న సెషన్ తర్వాత వెనుకంజవేసి, చివరిగంటలో నిలువునా పడిపోయాయి. తొలుత 500 పాయింట్ల మేర పెరిగి 71,913 పాయింట్ల వరకూ పెరిగి సరికొత్త రికార్డు సృష్టించిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 930 పాయింట్లు నష్టపోయి 70,506 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇంట్రాడే గరిష్ఠం నుంచి ఒకదశలో 1,600 పాయింట్లకుపైగా కోల్పోయి 70,302 పాయింట్ల కనిష్ఠస్థాయిని సైతం చూసింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 21,593 పాయింట్ల రికార్డుస్థాయికి పెరిగిన అనంతరం నిలువునా 21,083 పాయింట్ల కనిష్ఠస్థాయికి పడిపోయింది. చివరకు 303 పాయింట్ల భారీ నష్టంతో 21,150 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ‘ప్రపంచ సూచీల ట్రెండ్ పాజిటివ్గా ఉన్నప్పటికీ, దేశీయ మార్కెట్లో హఠాత్తుగా అమ్మకాలు వెల్లువెత్తాయి.
ఇటీవలి భారీ ర్యాలీ ఫలితంగా మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల విలువలు భారీగా పెరగడం లాభాల స్వీకరణకు దారితీయడమే తాజా పతనానికి ప్రధాన కారణం. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరగడమూ లాభాల స్వీకరణకు పురికొల్పింది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వివరించారు. బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) రూ.1,332 కోట్ల నికర విక్రయాలు జరపగా, దేశీయ ఫండ్స్ భారీగా రూ. 4,754 కోట్లు పెట్టుబడి చేశాయి.
కరెక్షన్ ఎంతవరకూ?
నవంబర్ చివరివారం నుంచి జరిగిన నాన్-స్టాప్ ర్యాలీ తర్వాత కరెక్షన్ అనివార్యమేనని విశ్లేషకులు తెలిపారు. అయితే భారీగా క్షీణించినందున స్వల్పకాలిక టెక్నికల్ ట్రెండ్ నెగిటివ్గా మారిందని అన్నారు. ఏడు వారాలపాటు లాభాలు ఆర్జించిన నిఫ్టీ ఇండెక్స్కు ఇది తొలి పెద్ద పతనమని, దీంతో తదుపరి రోజుల్లో మరికొంత తగ్గే అవకాశం ఉన్నదని రెలిగేర్ బ్రోకింగ్ టెక్నికల్ అనలిస్ట్ అజిత్ మిశ్రా చెప్పారు. అయితే నిఫ్టీ అప్ట్రెండ్ ముగిసిపోయిందన్న నిర్ధారణకు అప్పుడే రాలేమని, 20 డీఎంఏ రేఖ కదులుతున్న 20,700 స్థాయిని కోల్పోతేనే కొద్దివారాల అప్ట్రెండ్ అంతమవుతుందని మిశ్రా వివరించారు. కానీ మిడ్, స్మాల్ క్యాప్స్లో అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంటుందని హెచ్చరించారు.
టాటా స్టీల్ టాప్ లూజర్
టాటా స్టీల్ 4.21 శాతం పతనమయ్యింది. ఎన్టీపీసీ, టాటా మోటార్స్, హెచ్సీఎల్ టెక్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పవర్గ్రిడ్, టెక్ మహీంద్రా, లార్సన్ అండ్ టుబ్రో, జేఎస్డబ్ల్యూ స్టీల్లు 3-4 శాతం మధ్య నష్టపోయాయి. సెన్సెక్స్ ప్యాక్ లో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాత్ర మే గ్రీన్లో ముగిసింది. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా యుటిలిటీస్ ఇండెక్స్ 4.65 శాతం తగ్గగా, టెలికమ్యూనికేషన్స్ ఇండెక్స్ 4.36 శాతం, పవర్ ఇండెక్స్ 4.33 శాతం, సర్వీసుల సూచి 4.20 శాతం చొప్పున పతనమయ్యాయి. మెటల్ సూచి 3.57 శాతం, కమోడిటీస్ సూచి 3.51 శాతం, ఇండస్ట్రియల్స్ 2.85 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.83 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 2.55 శాతం మేర తగ్గాయి.
ఒక్క రోజులోనే రూ.8.91 లక్షల కోట్ల సంపద ఆవిరి
తాజా మార్కెట్ పతనంతో ఈక్విటీ ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ.8.91 లక్షల కోట్ల సంపదను నష్టపోయారు. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.8,91,729 కోట్ల మేర తగ్గి రూ.3,50,19,999 కోట్లకు పడిపోయింది. కొద్ది రోజులుగా కొత్త రికార్డులు సృష్టిస్తున్న మార్కెట్ టెక్నికల్గా ఓవర్బాట్ జోన్లో పడిపోయిందని, ఇటువంటి సందర్భాల్లో భారీ లాభాల స్వీకరణ జరగడం సహజమేనని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సి చెప్పారు. అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయని, ప్రత్యేకించి మిడ్, స్మాల్క్యాప్స్ నిలువునా పతనమయ్యాయని వివరించారు.