ముంబై, మార్చి 11: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలకుతోడు మెటల్, బ్యాంకింగ్ షేర్లలో నమోదైన అమ్మకాల ఒత్తిడితో సూచీలు కుప్పకూలాయి. ఉదయం ఆరంభం నుంచీ నష్టాల్లోనే కదలాడుతున్న మార్కెట్లు.. ఆఖరుదాకా అదే వరుసలో పయనించాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 616.75 పాయింట్లు లేదా 0.83 శాతం దిగజారి 73,502.64 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 685.48 పాయింట్లు కోల్పోవడం గమనార్హం. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 160.90 పాయింట్లు లేదా 0.72 శాతం పడిపోయి 22,332.65 వద్ద స్థిరపడింది. దీంతో రెండు రోజుల ర్యాలీకి బ్రేక్ పడినైట్టెంది.
స్మాల్క్యాప్ ఢమాల్
స్మాల్క్యాప్ షేర్లు భారీగా క్షీణించాయి. బీఎస్ఈలో ఏకంగా 2.01 శాతం పతనమయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాందోళనలే ఈ పరిస్థితికి దారితీసినట్టు మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ఇక మిడ్క్యాప్ షేర్లూ 0.24 శాతం కోల్పోయాయి. కాగా, సెన్సెక్స్ షేర్లలో పవర్ గ్రిడ్, టాటా స్టీల్ 2 శాతానికిపైగా పడిపోయాయి. ఇక ఎలక్షన్ కమీషన్కు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సమర్పించడానికి మరింత సమయాన్నివ్వాలని కోరుతూ ఎస్బీఐ వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో ఆ సంస్థ షేర్లు 2 శాతం దిగజారాయి.
మంగళవారం పనివేళలు ముగిసేలోపు పోల్ బాండ్లకు సంబంధించిన డాటాను ఈసీకి ఇవ్వాల్సిందేనని సుప్రీం తేల్చిచెప్పింది. తమ ఆదేశాలను బేఖాతరు చేస్తే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. మరోవైపు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యునిలివర్, ఎన్టీపీసీ షేర్లూ పెద్ద ఎత్తునే నష్టపోయాయి. ‘ముగింపు ధరల ఆధారంగా నిఫ్టీని వృద్ధి కోణంలో చూస్తే.. తక్షణ నిరోధాన్ని 22,400 వద్ద గుర్తించాం. అలాగే స్వల్ప కాలంలో 22,200-22,250 శ్రేణికి తగ్గవచ్చు’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ టెక్నికల్ సీనియర్ అనలిస్ట్ రూపక్ దే అన్నారు.
రంగాలవారీగా..
టెలీకమ్యూనికేషన్స్ షేర్లు 2.40 శాతం నష్టాలను చవిచూశాయి. ఆ తర్వాత మెటల్ (1.39 శాతం), యుటిలిటీస్ (1.25 శాతం), రియల్టీ (1.16 శాతం), ఎనర్జీ (1.15 శాతం) షేర్లు పడిపోయాయి. ‘అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగిన లాభాల స్వీకరణ, వడ్డీరేట్ల కోతలపై అనిశ్చితి.. దేశీయ మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ఇదిలావుంటే అంతర్జాతీయంగా.. ఆసియా మార్కెట్లలో జపాన్, దక్షిణ కొరియా సూచీలు నష్టపోయాయి. హాంకాంగ్, చైనా మాత్రం లాభపడ్డాయి. శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్లూ నష్టాల్లోనే ముగిసిన సంగతి విదితమే.
లక్షల కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్లలో చోటుచేసుకున్న భారీ నష్టాలు.. ఈ ఒక్కరోజే మదుపరుల సంపదను లక్షల కోట్ల రూపాయల్లో కరిగించేశాయి. బీఎస్ఈలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ సోమవారం దాదాపు రూ.3.1 లక్షల కోట్లు హరించుకుపోయింది. గురువారం ముగింపుతో చూస్తే రూ.392.8 లక్షల కోట్ల నుంచి రూ.389.7 లక్షల కోట్లకు దిగివచ్చింది. గతవారం చివరిరోజైన గురువారం విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి రూ.7,304.11 కోట్ల పెట్టుబడులను తెచ్చారు.
75వేలకు నిఫ్టీ?
2030-31కల్లా ఎన్ఎస్ఈ నిఫ్టీ 50,000 పాయింట్ల మార్కును తాకగలదని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్, సహ వ్యవస్థాపకులు రామ్డియో అగర్వాల్ అంటున్నారు. ఈ క్రమంలోనే వచ్చే పదేండ్లలో 75,000 పాయింట్ల స్థాయికి చేరుతుందన్న అంచనానూ వెలిబుచ్చారు. ఆర్థిక వ్యవస్థలో విస్తృత శ్రేణిలో జరుగుతున్న రికవరీనే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఐదేండ్లకుగాను ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, క్యాపిటల్ మార్కెట్స్దే హవా అన్నారు. వీటిల్లో పెట్టుబడులకు బోలెడు అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకుంటే లాభాల పంటేనన్నారు.