ఒకవైపు రూపాయి విలువ అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోవడం, అమెరికాలో వడ్డీ రేట్లు భారీగా పెరుగుతాయన్న సంకేతాలు అందడం, మరో వైపు అంతర్జాతీయంగా క్రూడ్, బంగారం ధరలు దిగిరావడం వంటి ప్రతికూల, సానుకూలాంశాలతో గతవారం మార్కెట్ నిర్ణీత శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యింది. వారం మొత్తం మీద ఎన్ఎస్ఈ నిఫ్టీ 171 పాయింట్ల నష్టంతో 16,171 పాయింట్ల వద్ద నిలిచింది. క్రితం వారంలో తొలి నాలుగు రోజులూ మార్కెట్ తగ్గినప్పటికీ, నష్టం పరిమితంగా ఉండటం గమనార్హం. వీక్లీ చార్టుల్లో ఇండెక్స్ ఇన్సైడ్ బార్ క్యాండిల్ కనపర్చడం…మూమెంటం నెమ్మదిస్తుందనడానికి సంకేతామని విశ్లేషకులు అంటున్నారు. ప్రతీ పెరుగుదలలోనూ అమ్మకాల ఒత్తిడి ఏర్పడవచ్చని చెపుతున్నారు. ఆటో, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ రంగాల షేర్లు పాజిటవ్గా ట్రేడ్ కావొచ్చని అంచనా వేస్తున్నారు.
16,150పైన స్థిరపడితేనే…
ఈ వారం 16,150 పాయింట్ల పైన నిఫ్టీ స్థిరపడితేనే స్వల్పకాలిక ర్యాలీ జరగవచ్చని సాంకేతిక విశ్లేషకులు సూచించారు. గతవారపు కనిష్ఠస్థాయి అయిన 15,850 వద్ద మద్దతు లభిస్తున్నదని, ఈ పైన నిలదొక్కుకుంటే సూచీ 15,950-16,275 పాయింట్ల మధ్య కన్సాలిడేటెడ్ కావొచ్చని చార్ట్వ్యూ ఇండియా అనలిస్ట్ మజార్ మహమ్మద్ తెలిపారు. 16,150పైన ముగిస్తే ట్రెండ్ బలపడుతుందని, 15,850 స్థాయిని కోల్పోతే మార్కెట్ మళ్లీ డౌన్ స్వింగ్లోకి వెళుతుందని వివరించారు. నిఫ్టీ ఈ వారం 16,200-16,300 శ్రేణి మధ్య నిరోధాన్ని చవిచూడవచ్చని, 15,700-15,800 శ్రేణి మద్దతుగా నిలుస్తుందని యాక్సిస్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ పాల్వియా తెలిపారు. సూచీకి గరిష్ఠస్థాయిలో స్థిరపడే బలం లోపించిందన్నారు.