అమెరికా, యూరప్ల్లో నెలకొన్న బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో గత వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 313 పాయింట్ల భారీ నష్టాన్ని చవిచూసి, 17,100 వద్ద ముగిసింది. రెండు వారాలుగా జరిగిన అమ్మకాలతో మార్కెట్ ట్రెండ్ బేరిష్గా మారిపోయిందని యాక్సిస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ రాజేష్ పాల్వియా చెప్పారు. ముఖ్యంగా గతవారం టెక్నికల్ చార్టుల్లో డ్యామేజి జరిగినందున, రానున్న కొద్ది రోజులూ ట్రెండ్ బేరిష్గానే ఉంటుందని ఈక్విటీరీసెర్చ్.ఆసియా వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ అంచనా వేశారు. మార్చి 22న అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం, బ్యాంకింగ్ సంక్షోభం తీరు తెన్నులపై ప్రస్తుతం ఇన్వెస్టర్ల దృష్టి నిలిచివుందని, దీంతో ఈ వారం మార్కెట్లో ఒడిదుడుకులు నెలకొంటాయని విశ్లేషకులు చెప్పారు.
నిఫ్టీ కీలక మద్దతు 16,800
ఈ వారం నిఫ్టీకి 16,800-16,750 శ్రేణి మధ్య కీలకమైన మద్దతు ఉందని, ఈ స్థాయిని కోల్పోతే 16,450-16,400 శ్రేణికి పతనం అయ్యే ప్రమాదం ఉందని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోదీ తెలిపారు. 17,300-17,350 శ్రేణిని అధిగమిస్తేనే బుల్లిష్ మూమెంటం ఏర్పడుతుందని, 17,500-17,550 శ్రేణి వరకూ పెరగవచ్చని అంచనా వేశారు. 200 డీఎంఏ నిలిచిఉన్న 17,450 స్థాయిని దాటేంతవరకూ అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుందని మిలన్ వైష్ణవ్ తెలిపారు. ఈ వారం నిఫ్టీకి 16,900, 16,710 స్థాయిలు మద్దతును ఇవ్వవచ్చని, 17,250, 17,350 స్థాయిలు అవరోధాన్ని కల్పించవచ్చని చెప్పారు.