ముంబై, ఆగస్టు 26: కరోనావైరస్ సెకండ్వేవ్తో భారత్ బ్యాంకుల మొండి బకాయిలు పెరుగుతాయని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ హెచ్చరించింది. కొవిడ్ తొలివేవ్తో వ్యక్తిగత రుణగ్రస్తుల్లో, చిన్నవ్యాపారాల్లో ఏర్పడిన ఒత్తిడి రెండోవేవ్తో మరింత పెరుగుతుందని మూడీస్ అంచనావేసింది. వచ్చే రెండేళ్లలో బ్యాంకుల్లో కొత్తగా ఏర్పడే నిరర్థక రుణాలు (ఎన్పీఎల్)1.5 శాతం పెరగవచ్చని మూడీస్ అంచనావేసింది. అయితే ఆర్థిక వ్యవస్థ క్రమేపీ కోలుకోవడం, ప్రభుత్వ మద్దతు కొనసాగడం వంటి అంశాలతో రుణ సమస్యల తీవ్రత తక్కువగానే ఉండవచ్చని పేర్కొంది. మొండి బకాయిలతో ఏర్పడిన నష్టాల్ని భర్తీచేసుకునేందుకు బ్యాంకుల వద్ద తగిన మూలధనం కూడా ఉందని మూడీస్ తెలిపింది.
ప్రభుత్వం ప్రకటించిన ఎమర్జన్సీ క్రెడిట్ లింక్డ్ గ్యారంటీ స్కీముతో చిన్న వ్యాపారాలకు తక్షణ లిక్విడిటీ లభిస్తుందని మూడీస్ వైస్ ప్రెసిడెంట్ అల్కా అన్బారసు తెలిపారు. కనిష్ఠ వడ్డీ రేట్లు, రుణ పునర్వ్యవస్థీకరణ స్కీములు&బ్యాంకుల మొండిబకాయిల రిస్క్ల్ని తగ్గిస్తాయని అల్కా పేర్కొన్నారు. కరోనా సంక్షోభం తలెత్తకముందు బ్యాంకుల బ్యాలెన్స్ షీట్స్ మెరుగుదల మొదలయ్యిందని, సెకండ్వేవ్ కారణంగా ఈ మెరుగుదల ప్రక్రియలో జాప్యం జరుగుతుంది తప్ప, పట్టాలు తప్పబోదని మూడీస్ వివరించింది. వచ్చే రెండేళ్లలో కొత్త మొండిబకాయిలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, సగటు ఎన్పీఏల నిష్పత్తి స్థిరంగానే కొనసాగవచ్చని రేటింగ్ ఏజెన్సీస్ అంచనాల్లో పేర్కొంది.