న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: అదానీ గ్రూపు షేర్లలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై నిగ్గు తేల్చడానికి రంగంలోకి దిగిన స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి మరింత సమయం కావాలని కోరుతున్నది. ఇప్పటికే సుప్రీంకోర్టు రెండు నెలల గడువు మాత్రమే ఇవ్వగా..ఈ సమయం సరిపోదని, కనీసం ఆరు నెలల సమయం కావాలని అత్యున్నత న్యాయస్థానానికి సెబీ విన్నవించుకున్నది. గత నెలలో సెబీకి కోర్టు పలు సూచనలు చేసింది. అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ ఆరోపణలతో భారీగా నష్టపోయిన దేశీయ పెట్టుబడిదారులకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, రెండు నెలల్లో తగిన పరిష్కారం చూపించాలని మార్చి 2న సెబీకి కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.