SEBI | ప్రవేశపెట్టనున్న సెబీ
న్యూఢిల్లీ, ఆగస్టు 8: కేవలం మార్కెట్ ఇండెక్స్ లేదా నిర్దేశిత మార్కెట్ విభాగాన్ని మాత్రమే ట్రాక్ చేస్తూ పెట్టుబడులు చేసే పాసివ్ ఫండ్స్ పాటించాల్సిన నిబంధనల్ని సరళతరం చేసేందుకు రెగ్యులేటర్ సెబీ కసరత్తు చేస్తున్నది. పాసివ్ ఫండ్స్ కోసం ప్రత్యేకించి ‘ఎంఎఫ్ లైట్’ నియంత్రణల్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు సెబీ తాజాగా విడుదల చేసిన తన వార్షిక నివేదికలో వెల్లడించింది. పాసివ్ ఇండెక్స్ ఫండ్స్కు, ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్కు (ఈటీఎఫ్లు), ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్చేసే ఫండ్ ఆఫ్ ఫండ్స్కు సరళతర నిబంధనల్ని వర్తింపచేస్తామని, దీంతో ఇవి పాటించాల్సిన, రెగ్యులేటర్కు రిపోర్ట్ చేయాల్సిన పలు అంశాల నుంచి వీటికి ఊరట లభిస్తుంది.
పాసివ్, యాక్టివ్ ఫండ్స్ పెట్టుబడుల శైలి భిన్నంగా ఉంటుంది. పాసివ్ ఫండ్స్ను నిర్వహించే మేనేజర్ల పెట్టుబడి నిర్ణయాలు కేవలం ఇండెక్స్ మార్పులకు లోబడి మాత్రమే ఉంటాయి. అదే యాక్టివ్ ఫండ్ మేనేజర్లు అయితే వారి అంచనాలు, అభిప్రాయాలకు అనుగుణంగా పోర్ట్ఫోలియోల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటారు. లక్షలాది మంది చిన్న ఇన్వెస్టర్ల నుంచి నిధుల్ని సేకరించే మ్యూచువల్ ఫండ్ స్కీమ్లు పలు నియంత్రణల్ని పాటించాల్సి ఉంటుంది. హై నెట్వర్త్ ఇన్వెస్టర్ల పెట్టుబడుల్ని నిర్వహించే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు కూడా కఠినమైన నిబంధనల్ని సెబీ నిర్దేశిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇష్టానుసారం మార్కెట్లో పెట్టుబడిచేసే యాక్టివ్ ఫండ్స్కు వర్తించే నిబంధనల నుంచి పాసివ్ ఫండ్స్కు ఊరట కల్పించేందుకు ‘ఎంఎఫ్ లైట్’ను సెబీ ప్రతిపాదిస్తున్నది.