(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): అదానీ-హిండెన్బర్గ్ వివాదానికి సంబంధించి దర్యాప్తును ముగించేందుకు గడువును మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హిండెన్బర్గ్ ఆరోపణలకు సంబంధించి తాము దర్యాప్తు చేస్తున్న 24 అంశాలలో 17 అంశాల్లో విచారణను పూర్తి చేసినట్లు సెబీ ఈ సందర్భంగా సుప్రీంకు తెలిపింది. మిగిలిన వాటిపై దర్యాప్తును పూర్తిచేయడానికి మరో పక్షం రోజులు గడువు పొడిగించాలని ధర్మాసనాన్ని కోరింది. అదానీ-హిండెన్బర్గ్ దర్యాప్తును పూర్తిచేయడానికి గడువు పొడిగించాలంటూ గత మేలోనూ సెబీ కోర్టును కోరడం తెలిసిందే.