న్యూఢిల్లీ, జూన్ 15: వివిధ లిస్టెడ్ కంపెనీలపై మార్కెట్లో నెలకొనే పుకార్లు, మీడియాలో వెలువడే కథనాలపై పలు సంస్థలు స్టాక్ ఎక్సేంజీలు కోరితే తప్ప..అవి వాస్తవమో కాదో నోరువిప్పవు. ఈ నేపథ్యంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ప్రధాన మీడియాలో వచ్చే ఎటువంటి మార్కెట్ పుకార్లనైనా ఖండించాలి లేదా వివరణ ఇవ్వాలంటూ లిస్టెడ్ కంపెనీలకు డిస్క్లోజర్ రూల్స్ను నోటీఫై చేసింది.
సాధారణ సమాచారం కాకుండా పుకార్లను సూచించే వార్తలు, కథనాలు వెలువడిన 24 గంటల లోపు కంపెనీలు వాటిని ‘ధృవీకరించడం లేదా వివరణ ఇవ్వడం లేదా ఖండించడం’ చేయాలని సెబీ నిర్దేశించింది. ఈ నిబంధనను మార్కెట్ విలువలో టాప్ 100 లిస్టెడ్ కంపెనీలు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. టాప్ 250 లిస్టెడ్ కంపెనీలకు ఈ నిబంధన 2024 ఏప్రిల్ 1 నుంచి వరిస్తుందని సెబీ జారీచేసిన నోటిఫికేషన్లో పేర్కొంది.