NSE MD & CEO | నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) మేనేజింగ్ డైరెక్టర్ కం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా ఆశీష్ కుమార్ చౌహాన్ పేరును స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదించింది. ప్రస్తుతం ఆశీష్ కుమార్ చౌహాన్.. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈవోగా ఉన్నారు.
ప్రస్తుతం ఎన్ఎస్ఈ మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈవోగా ఉన్న విక్రం లిమాయే శనివారం పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో నూతన ఎండీ కం సీఈవో నియామకానికి సెబీ ముందు ఎన్ఎస్ఈ రెండు పేర్లు ప్రతిపాదించింది. ఆశీష్ కుమార్ చౌహాన్ పేరును సెబీ ధృవీకరించినట్లు అధికార వర్గాల కథనం.
ఇక ఎన్ఎస్ఈ ఎండీ కం సీఈవోగా ఆశీష్ కుమార్ నియామకాన్ని ఎక్స్చేంజ్ వాటాదారులు ఆమోదించాల్సి ఉంటుంది. నూతన సీఈవో కం ఎండీ బాధ్యతలు స్వీకరించే వరకు ఎక్స్చేంజ్ లావాదేవీలను పర్యవేక్షించడానికి ఎన్ఎస్ఈ నలుగురు సభ్యుల కమిటీని నియమించింది. బీఎస్ఈ ఎండీ కం సీఈవోగా రెండోసారి ఐదేండ్ల పదవీ కాలం నవంబర్తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆశీష్ కుమార్ చౌహన్ స్థానంలో నూతన ఎండీ కం సీఈవో కోసం బీఎస్ఈ కసరత్తు ప్రారంభించింది.