ముంబై, డిసెంబర్ 17: కంపెనీ ఐపీవో సమర్పించిన ఐపీవో డాక్యుమెంట్లను క్లియర్ చేసే సమయాన్ని కేవలం ఏడు రోజులకు తగ్గించాలని యోచిస్తున్నట్టు సెబీ చీఫ్ మాదాభి పురి బుచ్ చెప్పారు. ప్రస్తుతం ఐపీవో క్లియరెన్స్కు సెబీ 70 రోజుల సమయం తీసుకుంటున్నది. ముంబైలో జరిగిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల సదస్సులో ఆమె మాట్లాడుతూ పబ్లిక్ ఇష్యూల క్లియరెన్స్ కాలపరిమితిని గణనీయంగా తగ్గించాలన్నది తన అభిమతమని, ఈ డాక్యుమెంట్లపై ఏడు రోజుల్లోనే నిర్ణయం తీసుకునే పరిస్థితి త్వరలోనే వస్తుందన్నారు.
ఐపీవో పత్రాల దాఖలు, రెగ్యులేటరీ క్లియరెన్స్ ప్రక్రియలో జాప్యాన్ని కుదించేందుకు తమ సిబ్బంది ఇప్పటికే కసరత్తు ప్రారంభించారన్నారు. నూతన ఫ్రేమ్వర్క్ అమలవుతున్న ప్రస్తుత తరుణంలో దరఖాస్తుల క్లియరెన్స్లో జాప్యం సెబీకి మంచి పేరు తీసుకురాదని, ఆలస్యానికి కారణమెవరో ప్రతీ ఒక్కరికీ తెలుసునని సెబీ చైర్పర్సన్ వివరించారు. ‘ఏడు రోజుల్లో సెబీ డాక్యుమెంట్లను క్లియర్ చేస్తుందని నేను చెపుతున్నాను. అందుకు బంతి మీ కోర్టులోనే 80 శాతం ఉంది. 20 శాతం సెబీ చెంత ఉంది. ఇది అందరికీ సవాలే. అందులో నేనూ భాగమే. మార్చి లోపే జాప్యాన్ని తగ్గిద్దాం’ అంటూ బ్యాంకర్లకు సెబీ చీఫ్ పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియకు సంబంధించిన సెబీ ఆదేశాలు తమకు అందినట్టు సదస్సులో పాల్గొన్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు చెప్పారు.