న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 : ఆర్థిక వ్యవస్థకు కృత్రిమ మేధస్సు (ఏఐ)తో ప్రమాదమేనని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే అన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఏఐతో నిఘాను పటిష్టం చేసుకోవచ్చని, మోసాలను గుర్తించవచ్చని చెప్పారు. అయితే రిస్కులు, అస్పష్టత, పక్షపాతాలు కూడా ఎదురవుతాయన్న ఆందోళననూ వెలిబుచ్చారు. అందుకే రెగ్యులేటర్లు సంస్థలతోపాటు వ్యవస్థల్ని, సాంకేతికతల్ని సైతం తప్పక పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
అలాగే నియంత్రిత ఆర్థిక, అనియంత్రిత డిజిటల్ వేదికల మధ్యనున్న సరిహద్దుల్ని గుర్తెరిగి నడుచుకోవడం కూడా మంచిదన్నారు. ఇదిలావుంటే భారతీయ మార్కెట్ క్యాపిటలైజేషన్.. గడిచిన 10 ఏండ్లలో నాలుగింతలకు పైగా వృద్ధి చెందినట్టు చెప్పారు. నేడు రూ.470 లక్షల కోట్లకు పైగా ఉందన్నారు. జీడీపీలో వాటా 2015లో దాదాపు 81 శాతంగా ఉంటే.. ఇప్పుడు 138 శాతంగా ఉన్నట్టు తెలిపారు. కాగా, సెబీ చెక్ టూల్, వ్యాలిడేటెడ్ యూపీఐ హ్యాండిల్స్ను ప్రమోట్ చేయడానికి, వాటి గురించి మదుపరులలో అవగాహనను పెంచేందుకు ఏఐ ఆధారిత ప్రచారాన్ని సెబీ ప్రారంభించింది. గత ఏడాది అక్టోబర్ 1న వీటిని పరిచయం చేసినది తెలిసిందే.
హైదరాబాద్కు చెందిన ఔషధ రంగ సంస్థ విరూపాక్ష ఆర్గానిక్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు సెబీ ఆమోదం తెలిపింది. రూ.740 కోట్ల ఈ పబ్లిక్ ఇష్యూలో మొత్తం ఈక్విటీ షేర్ల ఫ్రెష్ ఇష్యూనే. అయితే ప్రీ-ఐపీవో ప్లేస్మెంట్ రౌండ్లో రూ.148 కోట్ల నిధులను కంపెనీ సమీకరించేలా ఉందన్న అంచనాలున్నాయి. ఇదే జరిగితే ఇష్యూ పరిమాణం తగ్గనున్నది. ఉత్పాదక సామర్థ్యం విస్తరణకు, రుణ చెల్లింపులకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు ఈ నిధులను కంపెనీ వినియోగించనున్నదని సమాచారం. అలాగే ముంబైకి చెందిన హెక్సగాన్ న్యూట్రిషన్, అహ్మదాబాద్ ఆధారిత ఓమ్ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీలతోపాటు ప్రీమియర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్, పరుపుల తయారీ సంస్థ డ్యూరోఫ్లెక్స్ కంపెనీల ఐపీవోలకూ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.