ముంబై: కొటక్ మహీంద్రాపై సెబీ కొరడా ఝుళిపించింది. దేశంలోనే అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో ఒకటైన కొటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ సంస్థను ఆరు నెలల పాటు ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లు (ఎఫ్ఎంపీస్) ప్రారంభించకుండా నిషేధించింది. నిబంధనలను ఉల్లంఘించడంతోపాటు ఇన్వెస్టర్ల ప్రయోజనాలను హరిస్తున్నందుకు రూ.50 లక్షల ఫైన్ విధిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ జరిమానాను ఆదేశాలు జారీ చేసిన 45 రోజుల్లో చెల్లించాలని స్పష్టం చేసింది.
దేశంలో పాపులర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లలో ఎఫ్ఎంపీస్ ఒకటి. కొటక్ మహీంద్రా అసెట్స్ మేనేజ్మెంట్ వద్ద రూ. వేల కోట్లలో నిధులు ఉన్నట్లు డేటా ఫ్రం వాల్యూ రీసెర్చ్ ద్వారా తెలిపింది. కొటక్ ఏఎంసీ తీరుపై 2019 నుంచి దర్యాప్తు చేస్తున్నది. ఎఫ్ఎంపీఎస్ ఇన్వెస్టర్ ఫండ్స్.. కొన్ని నష్టాల్లో ఉన్న కంపెనీల డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుబడులు పెడుతున్నదని తేలింది. మెచ్యూరిటీ టైం ముగిసిన తర్వాత ఇన్వెస్టర్లకు పూర్తిస్థాయిలో రిటర్న్స్ చెల్లించడం లేదని సెబీ దర్యాప్తులో నిర్ధారించుకున్నది. దీనిపై స్పందించడానికి కొటక్ మహీంద్రా అసెట్స్ అందుబాటులోకి రాలేదు.