SEBI on Deccan Chronicle | హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఇంగ్లిష్ దినపత్రిక దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్), దాని ప్రమోటర్లపై స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝుళిపించింది. డీసీహెచ్ఎల్, దాని ప్రమోటర్లు రెండేండ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో లావాదేవీలు జరుపకుండా నిషేధం విధించింది. ఇంతకుముందు ఈ నిషేధం ఏడాది మాత్రమే ఉంది. వివిధ చట్టాల ఉల్లంఘనకు పాల్పడినందుకు రూ.8.20 కోట్ల పెనాల్టీ చెల్లించాలని ఆదేశించింది. 2008-09 నుంచి 2011-12 ఆర్థిక సంవత్సరాల మధ్య దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ తీసుకున్న రుణాలు, ఆర్థిక ప్రకటనల్లో మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడినట్లు సెబీ నిర్ధారించింది.
దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్పై రూ.4 కోట్లు, ప్రమోటర్లు టీ వెంకట్రామిరెడ్డి, టీ వినాయక్ రవి రెడ్డిలపై రూ.1.30 కోట్ల చొప్పున, ఎన్ కృష్ణన్పై రూ.20 లక్షలు, వీ శంకర్పై రూ.10 లక్షల ఫైన్ విధించింది. స్టాక్ మార్కెట్లలో టీ వెంకట్రామిరెడ్డి, టీ వినాయక్ రవి రెడ్డి, పీకే అయ్యర్, ఎన్ కృష్ణన్, వీ శంకర్లు రెండేండ్లు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ షేర్ల క్రయ విక్రయాలకు పాల్పడవద్దని ఆదేశించింది.
2011 అక్టోబర్ నుంచి 2012 డిసెంబర్ మధ్య దక్కన్ క్రానికల్ (డీసీహెచ్ఎల్)పై సెబీ విచారణ జరిపింది. ఈ విచారణలో డీసీహెచ్ఎల్, దాని ప్రమోటర్లు.. మోసపూరిత, అనుచిత వాణిజ్య పద్దతుల నిషేధ చట్టం Prohibition of Fraudulent and Unfair Trade Practices (పీఎఫ్యూటీపీ) ప్రకారం పలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు సెబీ విచారణలో తేలింది. ఇన్సైడర్ ట్రేడింగ్ రెగ్యులేషన్ నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారించినట్లు సెబీ తెలిపింది. కంపెనీ ఆర్థిక స్థితిగతులపై ప్రకటనలు చేయడంలో సంస్థ చైర్మన్ టీ వెంకట్రామిరెడ్డి, వైస్చైర్మన్ పీకే అయ్యర్ చట్టానికి అనుగుణంగా వ్యవహరించడంలో విఫలమయ్యారని స్పష్టం చేసింది.